ఈ యాప్ ఎస్సై పరీక్ష కేంద్రానికి దారి చూపుతుంది | Sakshi
Sakshi News home page

ఈ యాప్ ఎస్సై పరీక్ష కేంద్రానికి దారి చూపుతుంది

Published Thu, Apr 14 2016 3:32 AM

ఈ యాప్ ఎస్సై పరీక్ష కేంద్రానికి దారి చూపుతుంది - Sakshi

 ‘ఫైండ్ మి@యాప్’ను ఆవిష్కరించిన డీజీపీ అనురాగ్ శర్మ
 
 సాక్షి, హైదరాబాద్: ఎస్సై పరీక్షలు రాసే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వివరాలు, అక్కడికి చేరుకోవడానికి సులువైన దారి తెలుసుకునేందుకు ‘ఫైండ్ మి@యాప్’ ఉపయోగపడుతుందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. జేఎన్‌టీయూహెచ్ సహకారంతో టీహబ్ స్టార్టప్‌లోని యాప్ స్పేస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఈ యాప్‌ను డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ బుధవారం ఆవిష్కరించారు. ఐ ఫోన్‌తో పాటుగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో ఈ యాప్ లభ్యమవుతుందని, ఈ ఫోన్‌లు లేనివారు ‘వే టు ఎస్‌ఎంఎస్’ ద్వారా వివరాలు పొందవచ్చని తెలిపారు. దీనికోసం 9222273310కు హాల్‌టికెట్, రిజిస్ట్రేషన్ నంబర్లు ఎస్‌ఎంఎస్ చేయాలన్నారు. ఎస్సై పరీక్షల కోసం ఏర్పాటుచేసిన 350 కేంద్రాల్లో 310కేంద్రాల వివరాలు గూగుల్ మ్యాప్‌లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. ఒకరిబదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్ చర్యలతో పాటు శిక్ష కూడా తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.

 నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు..
 ఈ నెల 17న జరిగే ఎస్సై పరీక్షకు అభ్యర్థులను గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, అయితే నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించరని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. అభ్యర్థులను ఎలక్ట్రానిక్ వస్తువులతో పరీక్ష హాల్‌లోకి అనుమతించరని, చేతి గడియారం కూడా తీసుకురావద్దని సూచించారు. కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్‌టికెట్, పూర్తిచేసిన ఆన్‌లైన్ అప్లికేషన్, పాస్‌పోర్టు ఫొటో, అభ్యర్థి ఐడీ ప్రూఫ్ తెలిపే ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లెసైన్స్ మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ సుదీప్ లక్టాకియా, ఐజీ నవీన్ చంద్, జేఎన్‌టీయూ కో ఆర్డినేటర్ ఫ్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు, మొబైల్ యాప్ ఎండీ రాజీవ్ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement