అమానుషం! | Sakshi
Sakshi News home page

అమానుషం!

Published Fri, Nov 4 2016 12:51 AM

అమానుషం! - Sakshi

కవల చిన్నారులపై తండ్రీకొడుకుల లైంగికదాడి

రాజేంద్రనగర్: మానవత్వం మరిచిన తండ్రీకొడుకులు క్రూరంగా మారారు. రాక్షసత్వం ప్రదర్శించి అభం శుభం తెలియని చిన్నారులపై తమ వికృత రూపం చూపించారు. కవల చిన్నారులపై తండ్రీకొడుకులు లైంగికదాడికి పాల్పడిన ఘోర సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలల హక్కుల సంఘం చొరవతో ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు వివరాల ప్రకారం.. లక్ష్మిగూడ రాజీవ్‌గృహకల్ప బ్లాక్ నెంబర్.24లో కిరణ్‌మిశ్రా, లవేష్‌మిశ్రా దంపతులు నివాసముంటున్నారు. వీరు నేపాల్ నుంచి వలస వచ్చారు. వీరికి కవలలైన ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. లవేష్‌మిశ్రా స్థానికంగా ఓ బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పదేళ్ల వయసున్న కవల బాలికలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. అరుుతే వీరి ఇంటి పక్కనే జాఫర్, అతడి కుమారుడు బషీర్ గత కొన్ని రోజులుగా ఈ బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని తల్లికి తెలిపినా ఆమె పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు.

దీంతో చిన్నారులు గురువారం ఉదయం పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం తెలపగా, వారు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావుకు సమాచారం అందించారు. సంఘం ప్రతినిధులు సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా,  శంషాబాద్ డీసీపీ పద్మజా, రాజేంద్రనగర్ ఏసీపీ రంగారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులతో పాటు చిన్నారులను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాలికల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి హైదర్షాకోట్‌లోని కస్తూర్భా ట్రస్ట్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రులను ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. సైబరాబాద్ కమిషనర్ శాండిల్యా రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొని కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు అక్కడే ఉండడంతో వారిని ప్రశ్నించారు. 

కఠినంగా శిక్షించాలి...
నిందితులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు అన్నారు. రోజు రోజుకు పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement