అయ్యో పాపం..పసివాళ్లు | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం..పసివాళ్లు

Published Tue, Jun 28 2016 11:27 PM

అయ్యో పాపం..పసివాళ్లు

నగరంలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చిన్నారులు మృతి


నాన్న అడుగుల్లో అడుగులేస్తూ వచ్చిన ఓ పసి బాలుడు సంపులో పడి మృతి చెందాడు.  ఇంటి ముందు ఆడుకుంటూ {పమాదవశాత్తూ పక్కనే ఉన్న  దేవాలయం సంపులో పడి మరో చిన్నారి మత్యువాత పడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. తెగిపడిన కరెంటు వైర్లు తగిలి విద్యుత్ షాక్‌తో ఓ ఐదేళ్ల పాప మృత్యు ఒడికి చేరింది.ఇలా నగరంలో ఒకే రోజు ముగ్గరు పాల బుగ్గల పసి వయసు చిన్నారులు అనంతలోకాలకు చేరుకున్న సంఘటనతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

బోడుప్పల్/రాజేంద్రనగర్/మెహిదీపట్నం: హేమంత్(15 నెలలు) మంగళవారం సంపులో పడి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన తారారాం, ఇందిర దంపతులు. కొంత కాలం క్రితం నగరానికి వలస వ చ్చి స్థానిక సాయిరాంనగర్‌లో నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు అందులో ఒకరు హేమంత్. అయితే తారారం మంగళవారం తన ఇంట్లోని సంపులో నుంచి నీటిని ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లోకి నింపేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో సంపులోని నీళ్లు ఏ మేర ఉన్నాయో చూడడానికి సంపు తెరిచి చూస్తున్నాడు. ఇందంతా గమనిస్తున్న తారారం కుమారుడు హేమంత్ తండ్రి వెనకాలే సంపు దగ్గరికి చేరుకున్నాడు. తన కుమారుడు వచ్చిన విషయాన్ని గమనించని తారారం సంపులోని నీళ్లను చూసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత కొడుకు కనిపించకపోయేసరికి వెతకడం మొదలుపెట్టారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సంపులో చూసేసరికి హేమంత్ అందులో పడి ఉన్నాడు. తేరుకున్న తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ హేమంత్ అప్పటికే మృతి చెందాడని వైద్య పరీక్షల అనంతరం తేలింది.

 
మరో ఘటనలో...

సందీప్(5) అనే బాలుడు సంపులో పడి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఒంగోలుకు చెందిన సుబానీ ఆలియాస్ సుబ్బు, రాధా దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.  పుప్పాలగూడ ఎల్‌ఐసీ కాలనీ ప్రాంతంలోని ఓ నిర్మాణం వద్ద సుబ్బు వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సుబ్బు కుమారుడు సందీప్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్న పోచమ్మ దేవాలయం ప్రాంతంలోని నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో చూడగా సందీప్ సంపులో పడి ఉన్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.

 
విద్యుఘాతానికి చిన్నారి బలి...

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై తనూజ(5) అనే చిన్నారి మృతి చెందిన సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిబాబు తన భార్య హరిజతో కలిసి గత నాలుగేళ్లుగా గుడిమల్కాపూర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు తరుణ్(7), కుమార్తె తనూజ(5)లు ఉన్నారు. 8 నెలల క్రితం హరిబాబు మరణించడంతో హరిజ ఇద్దరు చిన్నారులతో కలిసి హుమాయూన్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వద్ద పనిలో కుదిరింది. సోమవారం రాత్రి తల్లి తనూజతో కలసి కిరాణం షాపుకు వెళ్లివస్తుండ గా రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement