Sakshi News home page

నేను బాల్కనీలో దాక్కున్నా...

Published Fri, May 15 2015 2:03 PM

నేను బాల్కనీలో దాక్కున్నా...

హైదరాబాద్ :  కళ్ల ఎదుటే అమ్మను, చెల్లిని, నాన్నమ్మను... నాన్న దారుణంగా హతమార్చాడు. తనను కూడా చంపేందుకు వస్తున్న తండ్రి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ చిన్నారి బాల్కనీలోకి పరుగెత్తి తలుపు గడియ పెట్టుకుంది. అదృష్టవశాత్తు తండ్రి బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యూష.. జరిగిన దారుణాన్ని భయం భయంగా వివరించింది. బాలాపూర్‌లోని సాయినగర్‌లో రామిరెడ్డి అనే వ్యక్తి తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతుకోసి హతమార్చిన విషయం తెలిసిందే. (చదవండి: కుటుంబ సభ్యులను హతమార్చిన కిరాతకుడు)

ఈ ఘటన నుంచి తప్పించుకున్న రామిరెడ్డి పెద్ద కుమార్తె ప్రత్యూష.. మీడియాతో మాట్లాడుతూ 'నిద్రలో ఉన్నా, అయితే ఏమైందో మమ్మీ పెద్దగా ఒర్లింది. డాడీ బయట నుంచి గొళ్లెం పెట్టిండు.. మళ్లీ అక్షయను పిలిచిండు. లోనికి పిలిచి చున్నీతో చంపిండు.  ఏమైంది అని నాన్నమ్మ డాడీని అడిగితే  ఏం కాలేదన్నడు.  ఆ తర్వాత నాన్నమ్మని చంపిండు. నాకు భయం వేసి బాల్కనీలో దాక్కున్నా. డోర్ పెట్టుకున్నా. డాడీ నన్ను కూడా పిలిసిండు. ప్రత్యూష బయటకు రా అని బెదిరించాడు. నాకు మస్తు భయం వేసింది. కింద నుంచి కత్తి వేశాడు. ఇంతలో పెదడాడీ వచ్చాడు. ఏమైందంటే.. నీవెవడ్రా.. వీళ్లను చంపితే నాకు ఆస్తి వస్తుంది. అందుకే చంపేశా అన్నడు. పెదమమ్మీని కూడా తిట్టాడు. ఆ తర్వాత బయటకు వెళ్లిపోయాడు' అని తెలిపింది.

కాగా హత్యల అనంతరం పరారీ అవుతూ ఓ వ్యవసాయ బావిలో పడిపోయిన రామిరెడ్డిని పోలీసులు బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆస్తి తగదాల కారణంగానే అతడు తన కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement