7 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు | Sakshi
Sakshi News home page

7 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు

Published Mon, Dec 7 2015 3:45 AM

7 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు - Sakshi

సాక్షి, హైదరాబాద్ : శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో 12 స్థానాలకు గాను 7 స్థానాలకు అధికార టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు ఆదివారం ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్న రెండేసి స్థానాలతోపాటు, వరంగల్ జిల్లా స్థానాల అభ్యర్థులను ప్రకటించలేదు. మిగిలిన ఆరు జిల్లాల్లోని ఏడు స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

నల్లగొండ - డాక్టర్ తేరా చిన్నపురెడ్డి, నిజామాబాద్ - డాక్టర్ భూపతిరెడ్డి, ఖమ్మం - బాలసాని లక్ష్మీనారాయణ, మెదక్ - వి. భూపాల్‌రెడ్డి, కరీంనగర్ 1- నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ 2 - భానుప్రసాద్‌రావు పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారని కె.కేశవరావు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి కేకే విలేకరులతో  మాట్లాడారు. స్థానిక సంస్థల కోటా శాసన మండలి ఎన్నికల్లో 12 స్థానాలనూ తామే గెలుచుకుంటామని, అన్నిచోట్లా వరంగల్ ఫలితమే పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, కాంగ్రెస్ తమను సంప్రదించలేదని అన్నారు. ఐదు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు చేస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారంతా తెలంగాణపై ప్రేమ ఉండి, పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఆశిస్తున్న వారేనని, తాము ఎవరినీ ఆకర్షించడం లేదని కేకే వివరించారు.

Advertisement
Advertisement