తెలంగాణ ద్రోహి తుమ్మల | Sakshi
Sakshi News home page

తెలంగాణ ద్రోహి తుమ్మల

Published Sun, Apr 24 2016 4:33 AM

తెలంగాణ ద్రోహి తుమ్మల - Sakshi

మేం తెలంగాణ రాష్ట్రమిచ్చాం..
పాలేరులో మాకు మద్దతివ్వండి
జేఏసీ చైర్మన్ కోదండరాంకు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకోసం ప్రజల్లోనూ, పార్లమెంటులోనూ పోరాడిన కాంగ్రెస్ పార్టీకి పాలేరు ఉప ఎన్నికలో మద్దతివ్వాల్సిందిగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంను పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసిన కాంగ్రెస్‌కు అండగాఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా టీడీపీలోనే ఉన్న తెలంగాణ ఉద్యమ ద్రోహి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని ఉద్యమ సందర్భాల్లోనూ కరుడుగట్టిన తెలంగాణవ్యతిరేకిగా ఉన్న తుమ్మలకు మద్దతిస్తే తెలంగాణ కోసం బలిదానాలు చేసినవారి ఆత్మలు ఘోషిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్... తుమ్మలను మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా ఉద్యమకారుల మనోభావాలను గాయపరిచింది’’ అంటూ లేఖలో ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ కోసం జరిగిన అన్ని ఉద్యమ సందర్భాల్లోనూ భాగస్వామిగా ఉందన్నారు. తెలంగాణ కోసం పోరాడటమే గాక జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులను పోటీలోకి దించుతున్న కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement