Sakshi News home page

రౌడీషీటర్‌ వాహెద్‌ దారుణ హత్య

Published Mon, Aug 8 2016 11:50 PM

హత్యకు గురైన వాహెద్, ఇన్‌సెట్‌లో అతని పాతచిత్రం

► ప్రత్యర్థిగా మారిన అనుచరుడు ఫెరోజ్‌
► పథకం ప్రకారం విందుకు పిలిచి ఘాతుకం
► జహీరాబాద్‌లో ఘటన
► దందాలో తలెత్తిన విభేదాలే కారణం


జహీరాబాద్‌/సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్‌ సయ్యద్‌ వాహెద్‌ (35) జహీరాబాద్‌లో దారుణహత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక బృందావన్‌ కాలనీ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌లో ఈ హత్య జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కథనం ప్రకారం... నగరంలోని బోరబండ పండిట్‌ నెహ్రూనగర్‌కు చెందిన పహిల్వాన్‌ వాహెద్‌పై సనత్‌నగర్‌ ఠాణాలో‡ రౌడీషీట్‌ ఉంది. ఇతడిపై 11 కేసులున్నాయి. మూడు హత్యలు, మరో మూడు రేప్‌ కేసుల్లో నిందితుడు. అంతేకాకుండా పండిట్‌ ¯ð హ్రూనగర్, రాజీవ్‌గాంధీ నగర్, యూసుఫ్‌ నగర్, వాహెద్‌ నగర్‌ ప్రాంతాల్లో తను అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకొని నేరాలు, సెటిల్‌మెంట్లు చేసేవాడు. దీంతో పీడీ యాక్ట్‌ కింద ఏడాది పాటు జైల్లో ఉండి.. ఈనెల 4న జైలు నుంచి విడుదలయ్యాడు. 

అతని గ్యాంగ్‌లోనే కొనసాగిన కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఫెరోజ్‌ సొంతంగా గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకుని భూదందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. ఇతడిపై ఒక హత్యతో పాటు పలు కేసులున్నాయి. వాహెద్‌ జైల్లో ఉన్న సమయంలో ఫెరోజ్‌ తన దందాలు ఉధృతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదిలా ఉండగా, గతంలో మాదిరిగా కలిసి పనిచేద్దామని ఫెరోజ్‌.. వాహెద్‌తో నమ్మబలికాడు. జహీరాబాద్‌లో విందు ఉందని, అక్కడికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పాడు. జహీరాబాద్‌కు చెందిన ఇనాయత్‌తో బీదర్‌కు చెందిన వ్యక్తి ఫాంహౌస్‌లో ఫెరోజ్‌ విందు ఏర్పాటు చేయించాడు.


2.30 గంటల ప్రాంతంలో హత్య
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫెరోజ్‌ తన అనుచరులు ఆరుగురితో హైదరాబాద్‌ నుంచి జహీరాబాద్‌ చేరుకున్నాడు.  సాయంత్రం 6 గంటలకు వాహెద్‌ ఏడుగురు అనుచరులతో ఫాంహౌస్‌కు వచ్చాడు.  ఫెరోజ్, అతడి మనుషులతో కలిసి గదిలో కూర్చుని వాహెద్‌ మద్యం తాగాడు. వాహెద్‌ అనుచరులు మాత్రం ఫాంహౌజ్‌ బయట కూర్చుని తాగారు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో వాహెద్‌పై ఫెరోజ్, అతని మనుషులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశాడు. దీంతో వాహెద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని అనుచరులపై దాడికి యత్నించగా వారంతా పరారయ్యాడు. మృతుడి తమ్ముడు వసీం విషయం తెలుసుకొని ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేశాడు.  డీఎస్పీ తిరుపతన్న, సీఐ నాగరాజు, ఎస్సైలు రాజశేఖర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్యకు గల కారణాలు సేకరించారు. విందు ఏర్పాటు చేసిన ఇనాయత్‌ను, ఫాంహౌస్‌ మేనేజర్‌ మొయిజ్‌ను విచారించారు.


మద్యం, మగువలతో ఎర
వాహెద్‌ను హత్య చేసేందుకు ప్లాన్‌ చేసిన ఫెరోజ్‌ మద్యం, మగువలను ఎరివేసినట్టు తెలుస్తోంది. విందులో 25 మంది వరకు ఉండి ఉంటారని, వారిలో మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఒక మహిళను గదిలోకి పంపించిన అనంతరం ఫెరోజ్‌ మనుషులు వాహెద్‌పై దాడి చేసి ఉండొచ్చని తెలిపారు. హత్యకు గురైన సమయంలో వాహెద్‌ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు, మహిళకు సంబంధించిన వస్రా్తలు కూడా పడి ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement