హైదరాబాద్ : గతేడాదిలో ఆశించిన దానికన్నా మద్యం అమ్మకాల్లో విపరీతమైన ఆదాయం సమకూరడంతో పాటు పెరగనున్న కేంద్ర నిధులను దృష్టి ఉంచుకొని 2016-17 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ కు రూపకల్పన జరుగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ ఏకంగా 1.30 లక్షల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ఉన్నతాధికారులతో ఆదాయ వ్యయాలపై సమీక్ష నిర్వహించారు.
ఎక్సైజ్ తో పాటు నాన్ - రెవెన్యూ టాక్స్ లక్ష్యాలను ఈసారి భారీగా పెంచాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులపై శాఖల వారిగా ప్రతిపాదనలను సాధ్యమైనంత తొందరగా తెప్పించుకుని పూర్తి చేయాలని చెప్పారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బడ్జెట్ కేటాయింపులకు, నిధుల వ్యయానికి మధ్య ఎంతో తేడా ఉంటున్నందున వచ్చే ఏడాది ఆదాయ సమీకరణలో భారీ లక్ష్యాలను నిర్ధేశించినట్టు తెలుస్తోంది.
కాగా బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహిస్తామా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని యనమల అన్నారు. వచ్చే ఏడాది పన్నేతర ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. బెరైటీస్, ఇసుక ప్రధాన ఆదాయ వనరులుగా భావిస్తామని, ఎక్సైజ్లో ఆదాయం 6శాతం వృద్ధి సాధించినట్లు యనమల పేర్కొన్నారు.