ప్రజాస్వామ్యం ఖూనీ | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ఖూనీ

Published Sun, Jul 6 2014 1:57 AM

ప్రజాస్వామ్యం ఖూనీ - Sakshi

*  మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల్లో అధికార పార్టీ దురాగతాలు
సీట్లు గెలుచుకోవడానికి దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమాలు
ప్రజా తీర్పును అపహాస్యం చేసిన ప్రభుత్వం
కుట్రలు కుతంత్రాలతో ప్రతిపక్షం గొంతు నొక్కిన అధికార పక్షం
* 15 మున్సిపాలిటీలను అప్రజాస్వామిక, అక్రమంగా గెలుచుకున్న టీడీపీ

 
 సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ బరితెగించింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలే దీనికి నిదర్శనం. గత మూడురోజులుగా చంద్రబాబునాయుడు ప్రతిక్షణం ఈ ఎన్నికలపైనే దృష్టి సారించి అటు పార్టీ నేతలకు, ఇటు అధికారులకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ మోహరించి మరీ స్థానిక స్థానాలను కైవసం చేసుకొనే ప్రయత్నాలు చేయించారు. చివరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లపై కూడా ఎమ్మెల్యేలు దాడులకు దిగారంటే పరిస్థితిని ఎంతలా దిగజార్చారో స్పష్టమవుతోంది.
 
టీడీపీ నేతలు సహకరించకపోవడం వల్ల తాను జడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని నెల్లూరు కలెక్టర్ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లాలోనూ ఏర్పడింది. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను బలవంతంగా బయటకు పంపి అధికారు లు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. రెండురోజులుగా జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ స్థానికి ఎన్నిక  జరగ నివ్వకండా అధికారపార్టీ నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
 
వైఎస్సార్ కాంగ్రెస్‌ను అడ్డుకోవడమే లక్ష్యం
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో వేళ్లూనుకోకుండా చేయడానికి అధికార తెలుగుదేశం కుట్రలకు తెరలేపింది. పార్టీ ఆవిర్భవించి ఎంతోకాలం కాకపోయినా, క్షేత్రస్థాయిలో సరైన పార్టీ నిర్మాణం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల ను వైఎస్సార్‌సీపీ అనేక సీట్లు గెలుచుకునే పరిస్థితిని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోయింది. మున్సిపల్, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ ఉన్న స్థానాలను ఆపార్టీ దక్కించుకుంటే క్షేత్రస్థాయిలో మరింతగా వేళ్లూనుకుంటుందని తెలుగు తమ్ముళ్లు భయపడ్డారు.

దీంతో మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులను బెది రించి, ప్రలోభాలు పెట్టి, చివరకు దాడులకు పురి కొల్పి టీడీపీ కైవసమయ్యేలా చేశారు. దాదాపు 15కు పైగా మున్సిపాల్టీలను, వందకు పైగా మండల పరిషత్తులను  అక్రమంగా టీడీపీ తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగంతో ప్రతిపక్ష గొంతు నొక్కినా ప్రజల గొంతు నొక్కలేరని, ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు  చెప్పారు.  
 
 రాష్ట్రంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 10,092 ఉండగా, అందులో వైఎస్సార్సీపీ 4,199 మంది, టీడీపీ 5,216 మంది, కాంగ్రెస్ 172 మంది, సీపీఐ 14మంది, సీపీఎం 24మంది, బీజేపీ 13 మంది, ఇతరులు 15మంది, ఇండిపెండెంట్లు 428 మంది గెలిచారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మెజార్టీ స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కాయి. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీకి ఆధిక్యమున్నా వైఎస్సార్‌సీపీ పోటాపోటీగా నిలిచింది.

అయితే వైఎస్సార్‌సీపీకి మెజార్టీ ఉన్న మండలాలను టీడీపీ కబ్జాచేసింది. మున్సిపాల్టీల్లోనూ ఇదే అరాచకానికి తెగబడింది. రాష్ట్రంలో 92 మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగ్గా  36 మున్సిపాల్టీల్లో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. తక్కిన స్థానాల్లో టీడీపీకి మెజార్టీ ఉంది. కానీ వైఎస్సార్‌సీపీకి కేవలం 15 మున్సిపాల్టీలే వచ్చాయి. ఆపార్టీకి దక్కాల్సిన 20కి పైగా మున్సిపాల్టీలను టీడీపీ అడ్డదారుల్లో చేజిక్కించుకుంది.
 
జెడ్పీ ఎన్నికల్లో..
రాష్ట్రంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గా లు 653. ఇందులో 275 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా 373 స్థానాలను టీడీపీ దక్కిం చుకుంది. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, కర్నూ లు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యముంది. తక్కిన జిల్లాల్లో టీడీపీకి ఆధిక్యముంది. ఆయా జడ్పీల్లో ఆధిక్యాన్ని అనుసరించి ఛైర్మన్ స్థానాలు ఆయా పార్టీలకు దక్కాలి. వైసీపీ ఆధిక్యమున్న చోట టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు.

Advertisement
Advertisement