‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం | Sakshi
Sakshi News home page

‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం

Published Wed, Apr 18 2018 3:02 PM

Amid Indian PM Modi Tour Of London Rights Groups Protest On Kathua Incident - Sakshi

లండన్‌: కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన విదేశీ పర్యటనల్లో ఇదివరకెప్పుడూ లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది. భారత్‌ను కుదిపేసిన కథువా హత్యాచార ఘటనను నిరసిస్తూ, ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు హక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. సౌత్‌ ఏసియా సాలిడారిటీ గ్రూప్‌ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. వాటిపై ‘మోదీ నాట్‌ వెల్‌కమ్‌..’, ‘జస్టిస్‌ ఫర్‌ ఆసిఫా’ రాతలను ప్రదర్శించారు. థేమ్స్‌ తీరంలోని బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎదుట, చుట్టుపక్కల వీధుల్లో ఆ వాహనాలను తిప్పారు. బ్రిటన్‌లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఆందోళనల నేపథ్యంలో భారత ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో లండన్‌ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే మరొకొన్ని చోట్ల మోదీ.. భారతీయు సమూహాలతో కరచాలనం చేస్తూ సందడి చేశారు.

జమ్మూకశ్మీరులోని కథువా జిల్లా రసానలో గుర్రాలు మేపుతోన్న ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, రోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి, చివరికు కొట్టి చంపిన ఘటనను ప్రపంచమంతా ఖండించింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఐక్యరాజ్యసమితి సైతం భారత ప్రభుత్వానికి సూచించింది. చిన్నారి హత్యాచారం కేసులో దర్యాప్తు చేసిన సిట్‌ ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేయగా, సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. అటు ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కథువా, ఉన్నావ్‌ ఘటనలపై గత శుక్రవారం స్పందించిన ప్రధాని మోదీ.. ఇటువంటి సంఘటనలు మన దేశానికి సిగ్గు చేటని, నేరస్థులను ఉపేక్షించేది లేదని అన్నారు.

Advertisement
Advertisement