సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ఎందుకు? అన్న ప్రశ్నకు మోదీ సర్కార్ చెప్పిన సమాధానాలలో నకిలీ నోట్ల నియంత్రణ కూడా ఒకటి ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతైనా కట్టడి చేయవచ్చని తాము భావిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది . అయితే కొత్త నోట్లు విడుదలైన నెల రోజులకే ఫేక్ కరెన్సీ చెలామణిలోకి రావటం మొదలైంది.
ఈ విషయంలో కొన్నాళ్ల క్రితం దాకా పాకిస్థాన్ ముందంజలో ఉన్నప్పటికీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. అత్యధికంగా రెండు వేల రూపాయల నకిలీ నోట్లను బంగ్లా సరిహద్దు నుంచే స్వాధీనం చేసుకున్నామని సరిహద్దు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఒకప్పుడు ఫేక్ నోట్లు పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో ముద్రితమై సరిహద్దు గుండా 13 ప్రాంతాల ద్వారా నకిలీ కరెన్సీని భారత్లోకి వచ్చేవి. ఇందులో 11 ప్రాంతాలు గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచినప్పటికీ.. అస్సాం, పశ్చిమబెంగాల్ ప్రాంతాలు మాత్రం ఈ యేడాది ప్రారంభం నుంచే మొదలయ్యింది అని అధికారులు చెబుతున్నారు.
ఈ యేడాది మొదటి ఆరునెలలో 32 లక్షలను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనపరుచుకోగా.. గతంలో కంటే తక్కువే పట్టుబడిందని చెప్పుకోవాలి. పాత 1000, 500 నోట్లు వాడుకంలో ఉన్న సమయంలో కోట్ల విలువ చేసే బంగ్లాదేశ్ సరిహద్దు గుండా ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో దీనిని ఉధృతం చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే సౌదీ ఆరేబియా, మలేషియాల నుంచి మన కొత్త నోట్లకు సంబంధించిన పేపర్ను రప్పించుకుని ముద్రించే పనిలో పడ్డారనేది సమాచారం. అయితే ప్రస్తుతం సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్రమ రవాణాకు ఆటంకంగా మారిందనే చెప్పవచ్చు. అదీగాక ప్రస్తుతం మన చెలామణిలో ఉన్న కొత్త కరెన్సీని తయారు చేయటానికి కావాల్సిన యంత్రాలు కేవలం అత్యున్నత దేశాలలో మాత్రమే లభిస్తుంటాయి. ఆ లెక్కన్న స్మగ్లర్లకు ఇప్పుడు నకిలీ నోట్ల ముద్రణ కష్టతరం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.