షాంఘై: మహమ్మారి కరోనా పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరంలో పేషంట్లందరూ కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్యశాఖ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య జీరోకు చేరుకుందని తెలిపాయి. ‘వుహాన్ నగరంలోని కోవిడ్ బాధితులందరూ కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఏప్రిల్ 26 వరకు ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదు. వుహాన్ నగర పాలక సంస్థ, దేశంలోని వైద్య సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైంది. అందరికీ కృతజ్ఞతలు’అని నేషనల్ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ పేర్కొన్నారు.
కాగా, వుహాన్లో 46,452 మంది కోవిడ్-19 బారినపడగా.. 3869 మంది మృతి చెందారు. చైనాలోని మొత్తం కేసుల్లో 56 శాతం, మరణాల్లో 84 శాతం ఇక్కడే నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 29 లక్షల మంది కోవిడ్ బారిన పడగా.. రెండు లక్షలకు పైగా బాధితులు ప్రాణాలు విడిచారు. 8 లక్షల 40 వేల మంది కోలుకున్నారు. 54 వేల మరణాలతో యూఎస్ ప్రథమ స్థానంలో ఉండగా.. 26 వేల మరణాలతో ఇటలీ, 22 వేల మరణాలతో స్పెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
(చదవండి: అమెరికా: కరోనాతో వాటికి మంచి జరిగింది!)