కూతుర్ని చంపాడంటూ అమాంతం గాల్లోకి ఎగిరి.. | Sakshi
Sakshi News home page

కూతుర్ని చంపాడంటూ అమాంతం గాల్లోకి ఎగిరి..

Published Sat, Jun 4 2016 3:04 PM

కూతుర్ని చంపాడంటూ అమాంతం గాల్లోకి ఎగిరి..

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. ఆ నిందితుడిపై పగపై రగిలిపోయాడు. శిక్ష పడుతుందని రెండేళ్ల నుంచి ఎదురుచూశాడు. చివరికి కోర్టులో అతడ్ని ప్రవేశపెట్టగా ఆ తండ్రి తీవ్ర ఆవేశంతో ఊగిపోయాడు. ఈ రోజు నా చేతిలో నువ్వు చస్తావు అంటూ ఒక్క ఉదుటున నిందితుడి మీదకు దూకాడు. అధికారులు కంట్రోల్ చేయడంతో నిందితుడ్ని వదిలేశాడు. గురువారం నాడు అమెరికాలోని ఓహియో కోర్టులో ఈ సంఘటన జరిగింది.

వాన్ టెర్రీ కూతురు షిరెల్డా టెర్రీ రెండేళ్ల కిందట దారుణ హత్యకు గురైంది. 2013లో మాడిసన్ ముగ్గుర్ని హత్య చేసి వారి మృతదేహాలను బ్యాగ్ లో తీసుకెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అంగెలా డిస్కిన్స్(38), షెటిషా షీలే(18), షిరెల్డా టెర్రీ(18)లను ఈస్ట్ క్లీవ్ లాండ్ లోని తన నివాసంలో అతి దారుణంగా హతమార్చాడు. ఓహియో కోర్టులో కేసు గురువారం విచారణకు వచ్చింది. నిందితుడు మాడిసన్ కు మరణశిక్ష విధించారు. అయినా వాన్ టెర్రీ కోపం చల్లారలేదు. అమాంతం గాల్లోకి ఎగిరి నిందితుడిపై దూకాడు. ఇంతలో అధికారులు ఒక్కసారిగా అప్పమత్తమై నిందితుడు మాడిసన్ ను పక్కకు జరిపారు.

దాదాపు పది మంది వ్యక్తులు ఆయనను పట్టుకుని వెనక్కి లాగుతున్నా కొంత సేపటి వరకు కంట్రోల్ చేయలేకపోయారు. అప్పటికీ దుఖంలో ఉన్న ఆ తండ్రి నన్ను వదలండీ సార్.. వాడు మా కుటుంబాన్ని టచ్ చేశాడు. ఆ నీచుడ్ని నా చేతులతోనే చంపేస్తాను. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న పాపాత్మున్ని శిక్షిస్తాను అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యం అక్కడి అధికారులతో పాటు కోర్టుకు హాజరైన వారిని కంటతడి పెట్టించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement