సైబర్ దొంగల టార్గెట్ క్రిస్మస్, న్యూ ఇయర్ | Sakshi
Sakshi News home page

సైబర్ దొంగల టార్గెట్ క్రిస్మస్, న్యూ ఇయర్

Published Fri, Nov 27 2015 5:54 PM

సైబర్ దొంగల టార్గెట్ క్రిస్మస్, న్యూ ఇయర్ - Sakshi

క్రిస్మస్, నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తున్నారు. పండుగల్లో కొనుగోలుదారులను టార్గెట్ చేసి... అధునాతన మాల్వేర్, స్పామ్ ప్రచారాలతో దోచేస్తున్నారు. రిటైల్ మార్కెట్లోనూ, ఆన్ లైన్ లోనూ వైరస్ లా వ్యాపిస్తున్న సైబర్ దొంగలతో జరభద్రం అంటూ... నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

అధునాతన మాల్వేర్ సాఫ్ట్ వేర్, స్పామ్ లతో ఓ దొంగల ముఠా చోరీలకు తెగబడుతోందని ఐ సైట్ భద్రత  సంస్థ హెచ్చరిస్తోంది. జనాన్ని ఫిషింగ్ ఈ మెయిల్స్ తోనూ, స్పామ్ లతోనూ భయపెట్టి బేరసారాలకు పాల్పడుతోంది. ఏకంగా కొన్ని దొంగల ముఠాలు ప్రసిద్ధ షాపింగ్ యాప్ ల నకిలీలు సృష్టించి, పేమెంట్ కార్డు డేటాను దోచేస్తున్నాయి. ఆమెరికా వంటి దేశాల్లో 'బ్లాక్ ఫ్రైడే', 'సైబర్ మండే', వీకెండ్ థ్యాంక్స్ గివింగ్ హాలీడే సమయంలో ఆన్ లైన్, ఆఫ్టైన్ స్టోర్లు ఇచ్చే ఆఫర్లనే సైబర్ నేరగాళ్ళు  అదనుగా చేసుకొంటున్నారు.  

ముఖ్యంగా అమెరికాలోని ప్రసిద్ధ 50 రిటైల్ బ్రాండ్స్ కు ఇప్పుడు అత్యంత అధునాతన 'మాడ్ పాస్ మాల్వేర్' (వైరస్) సోకినట్లు అనుమానించి, వారి వారి అంతర్గత కార్పొరేట్ నెట్ వర్క్ లను పరిశీలిస్తున్నట్లు ఐ సైట్ భద్రతా సంస్థ  సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ వార్డ్ చెబుతున్నారు. పాయింట్ ఆఫ్ సేల్ ఎక్విప్ మెంట్ మాటున దాగి ఉండే మాడ్యులర్ మాల్వేర్ వైరస్... పేమెంట్ కార్డ్ డేటాను క్షణాల్లో కంప్యూటర్ కు చేరుస్తుంది. ఈ వివరాలను  ఎటువంటి దుర్మార్గమైన చర్యకైనా ఉపయోగించవచ్చని వార్డ్ అంటున్నారు.

అమెరికా  ప్రభుత్వ సంయుక్త  రిటైల్ ఇంటిలిజెన్స్ భాగస్వామ్య కేంద్రం '2015 హ్యాకింగ్ సీజన్' పై రిటైల్ వ్యాపారస్థులకు సూచనలు, సలహాలు అందజేసింది. సంవత్సరంలో ముఖ్యంగా అత్యధికంగా అమ్మకాలు జరిగే ఈ సమయంలో రిటైలర్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచిస్తోంది. మాడ్ పాస్ వెనుక ముఠాను పట్టుకునేందుకు ట్రాక్ చేస్తున్నామని, అయితే ఈలోపు ముఖ్యమైన ఈ క్రిస్మస్ సందడిలో మోసపూరిత లావాదేవీలకు లొంగిపోకుండా జాగ్రత్త పడాలని భద్రతా సంస్థలు సూచిస్తున్నాయి.  సంప్రదాయ వ్యతిరేక వైరస్ మాల్వేర్ ను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, దొరికే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.

ఆన్ లైన్ వ్యాపారస్తులు కూడ హైటెక్ నేరస్తుల దాడికి గురయ్యే అవకాశం ఉందని...  మోసాలకు వ్యతిరేకంగా పనిచేసే... యాంటీ ఫ్రాడ్ కంపెనీ 'థ్రెట్ మెట్రిక్స్' హెచ్చరిస్తోంది. నిజానికి మూడో త్రైమాసికం వ్యాపారం సన్నగిల్లే సమయమని... క్రిస్మస్, నూతన సంవత్సరం షాపింగ్ సీజన్ వల్ల వినియోగదారులు ఖర్చుచేసే అవకాశం ఉండటంతో దాడి ప్రయత్నాలు రికార్డు స్థాయిలో జరుగుగున్నాయని థ్రెట్ మాట్రిక్స్ డైరెక్టర్ వనితా పాండే అంటున్నారు. ఎక్కువగా ఈ దాడులు నకిలీ లాగిన్ లతోనూ, చోరీ చేసిన ఆధారాలను ఉపయోగించి జరుగుతున్నాయని పాండే అన్నారు. నకిలీ వ్యాపారాలకు, ఆన్ లైన్ మోసాలకు ఇదే సరైన సమయమని, ఈ విషయంలో వినియోగదారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మోసాలకు లొంగకుండా జాగ్రత్త పడాలని సీనియర్ భద్రతా సలహా దారులు హెచ్చరిస్తున్నారు. ఆఫర్లకు లొంగి ఆయాచిత ఈ మెయిళ్ళను నమ్మొద్దని, కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement