భారత్కు వ్యతిరేకంగా కామెంట్లు వద్దు: పాక్ ప్రధాని | Sakshi
Sakshi News home page

భారత్కు వ్యతిరేకంగా కామెంట్లు వద్దు: పాక్ ప్రధాని

Published Sat, Dec 19 2015 12:16 PM

భారత్కు వ్యతిరేకంగా కామెంట్లు వద్దు: పాక్ ప్రధాని

ఇస్లామాబాద్: భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు, కామెంట్లు చేయవద్దని తన మంత్రి వర్గానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని సన్నిహితుడొకరు మీడియాకు వెల్లడించారు. భారత్-పాక్ దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పడానికి అగ్రనేతలు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని షరీఫ్ శుక్రవారం సూచించారు. భారత్-పాక్ల మధ్య శాంతి ఒప్పందాలపై ముందడుగు వేస్తామని షరీఫ్ ధీమాగా ఉన్నారు. ఇరుదేశాల మధ్య వైరాన్ని తగ్గించి, సంబంధాలు పెంపొందేలా వ్యాఖ్యలు చేయాలని, సలహాలు ఇవ్వాలని మంత్రులకు, సన్నిహితులను ఆయన కోరినట్లు సమాచారం.

పారిస్ అంతర్జాతీయ వాతావరణ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ కలుసుకున్న అనంతరం ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు బ్యాంకాక్లో సమావేశమైన విషయం అందరికీ విదితమే. ఈ నెల 8న జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం వెళ్లిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్, అఫ్ఘానిస్తాన్లలో పర్యటించారు. పాక్ మంత్రి సర్తాజ్ అజీజ్, ప్రధాని షరీఫ్ లతో సమావేశం ఫలితంగా వచ్చే ఏడాది జనవరిలో ఏదైనా తటస్థ వేదికలో చర్చలు జరగవచ్చని పాక్ ప్రధాని సన్నిహితుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement