రూ. 25 లక్షలతో దంగల్‌ కేక్‌ | Sakshi
Sakshi News home page

రూ. 25 లక్షలతో దంగల్‌ కేక్‌

Published Fri, Aug 11 2017 4:30 PM

రూ. 25 లక్షలతో దంగల్‌ కేక్‌

సాక్షి, న్యూఢిల్లీ: భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తమదైన శైలిలో జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ వినియోగదారుడి కోరిక మేరకు దుబాయ్‌లోని ‘బ్రాడ్‌ వే బేకరీ’ ఏకంగా 40వేల డాలర్లను (దాదాపు 25.5 లక్షల రూపాయలు)వెచ్చించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్‌ను తయారు చేసింది. దీనికి బాలీవుడ్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన, ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ను థీమ్‌గా తీసుకోవడం మరో అదనపు ఆకర్షణ.

నాలుగు అడుగులు ఎత్తు, 54 కిలోల బరువున్న ఈ కేక్‌ను తయారు చేయడానికి ప్రధాన చెఫ్, ఆయన సహాయకులకు మూడున్నర వారాలు పట్టింది. దంగల్‌ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ చూడడానికి ఎలా ఉంటారో, ఆయన హావ భావాలు ఎలా ఉంటాయో నిశితంగా  పరిశీలించడానికే చెఫ్‌ బందానికి వారం రోజులు పట్టింది. అచ్చం సినిమాలోలాగా ఆమీర్‌ ఖాన్‌ పర్యవేక్షణలో ఇసుక బరిలో ఇద్దరు మహిళలు రిజ్లింగ్‌ చేస్తున్న దశ్యాన్ని కేక్‌గా ఆవిష్కరించారు. ఈ కేక్‌ను 240 మంది అతిథులకు పంచవచ్చట. వివిధ రకాల చాక్లెట్‌ ఫ్లేవర్లను ఉపయోగించి తయారు చేసిన ఈ కేకులో 75 గ్రాముల తినే బంగారాన్ని ఉపయోగించారు.

అత్యంత ఖరీదైన ఈ కేక్‌ను ఎలా తయారు చేశారో చూపే వీడియోను కూడా బ్రాడ్‌ వే బేకరీ విడుదల చేసింది. ఇలా కొత్త కొత్త థీమ్‌లతో కేక్‌లను తయారు చేయడం తమకు కొత్తేమి కాదని, ఇంతకుముందు సూపర్‌ హిట్టయిన హాలివుడ్‌ హెచ్‌బీఓ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ త్రోన్‌’ నివాళిగా కూడా కేక్‌ను తయారు చేసినట్లు బేకరీ నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement