బ్యాంకాక్: ఆయన పేరు రోగర్ హుస్సే. వయసు 71 ఏళ్లు. పారాసెయిలింగ్ అంటే ఆయనకు తెగ ఇష్టం. ఏదైనా ఒకరోజు తాను పారాసెయిలింగ్ చేయాలని భార్యతో చెబుతుండేవాడు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన ఈ దంపతులు థాయిలాండ్కు వచ్చారు. వెంటనే బీచ్ వెళ్లగానే తన పారాసెయిలింగ్ కోరిక తీర్చుకునేందుకు రోగర్ రెడీ అయ్యారు. సెయిలింగ్కు ముందు ఆయనకు రక్షణగా ఉండే డ్రెస్ వేసే సమయంలో ఎంతో ఉల్లాసంగా నవ్వుతూ కనిపించారు. ఆయన భార్య స్వయంగా వీడియో తీసింది. కొద్ది సేపటి తర్వాత పారాసెయిలింగ్ శిక్షకుడు, రోగర్ కలిసి గగనతలంలో విహరించేందుకు బయలుదేరారు.
సముద్రంపై బోటు వేగంగా దూసుకెళుతుండగా వారు పారాసెయిలింగ్తో సముద్రంపై ఓ వంద అడుగుల ఎత్తులో దాదాపు 30 మీటర్ల ఎత్తులో తేలియాడుతున్నారు. అయితే, అనూహ్యంగా రోగర్ అంత ఎత్తు నుంచి తాడు తెగిపోయి సముద్రంలో పడ్డారు. దాంతో వీడియో తీస్తున్న ఆయన భార్య ఖిన్నురాలైంది. సముద్రంలో ఒడ్డున ఉన్నవారంతా ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయారు. వేగంగా సముద్రంలోకి ఆయనను రక్షించేందుకు వెళ్లి బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించినా మార్గం మధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్వాస ఆగిపోయిన కారణంగానే అతడు చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పారాసెయిలింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రోగర్ భార్యనే ఈ వీడియోను సోషల్ మీడియాతో పంచుకున్నారు.