ఐఎస్‌ తీవ్రవాదుల లొంగుబాటు.. కానీ | Sakshi
Sakshi News home page

వందమంది ఐఎస్‌ తీవ్రవాదుల లొంగుబాటు

Published Sat, Oct 14 2017 5:19 PM

Hundreds of IS terrorists surrender in Syria

కొబానె(సిరియా) : సిరియాలో ప్రజల జీవనం చాలా ఇబ్బందిగా మారిపోయింది. అక్కడ ప్రభుత్వ దళాలకు, తీవ్రవాద గ్రూపులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సిరియా నగరం రఖాలో ఇస్లామిక్‌స్టేట్‌కు చెందిన 100 మందికిపైగా తీవ్రవాదులు శుక్రవారం లొంగిపోయారని అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ బలగాలు ప్రకటించాయి. గత 24 గంటల్లో దాదాపుగా లొంగిపోయిన వందమంది తీవ్రవాదులను నగరం నుంచి వేరేప్రాంతానికి తరలించిట్లు తెలిపాయి. అయితే, వీరిలో విదేశీయులు మాత్రం రఖాలోనే పోరు సాగిస్తున్నారని వివరించింది.

నేటికి ఐస్‌కు పట్టున్న రఖా నుంచి దాదాపు 200 మంది తీవ్రవాదులు తమ కుటుంబాలతో వెళ్లిపోయారని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే హ్యూమన్‌రైట్స్‌ అబ్జర్వేటరీ తెలిపింది. రఖా నుంచి స్థానిక ఐఎస్‌ శ్రేణులు పూర్తిగా వైదొలిగాయని ఆ సంస్థ ప్రతినిధి రమి అబ్దెల్‌ రహ్మాన్‌ తెలిపారు. వారందరూ గుర్తు తెలియని ప్రాంతాలకు వెళ్లి ఉంటారని ఆయన అన్నారు.

అయితే, రఖాలో వివిధ దేశాలకు చెందిన తీవ్రవాదులు పనిచేస్తున్నారని, వారు లొంగిపోలేదని వివరించారు. నగరం నుంచి వెళ్లాలనుకునే పౌరులను పంపించేందుకు స్థానిక సివిల్‌ కౌన్సిల్‌తోపాటు గిరిజన మధ్యవర్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఐఎస్‌ సంస్థకు కీలకస్థావరంగా ఉన్న ఈ నగరంలో ప్రభుత్వ దళాలకు, తీవ్రవాద గ్రూపులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కొంత మంది అయితే భయబ్రాంతులతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

Advertisement
Advertisement