2015 నుంచి గొంతులు కోస్తున్నాడు.. | Sakshi
Sakshi News home page

2015 నుంచి గొంతులు కోస్తున్నాడు..

Published Wed, Jan 24 2018 3:41 PM

Indian origin New Jihadi John - Sakshi

న్యూయార్క్‌ : కేవలం కళ్లు మాత్రమే కనిపించేలాగ ముఖానికి నల్లటి ముసుగు. చేతిలో ఓ పదును తేలిన కత్తి.. చూసేందుకు ముసుగుదొంగలా కనిపించే ఆ వ్యక్తి ఉగ్రవాదుల్లోనే అతి క్రూరమైనవాడు. ఆదేశాలు అందుకున్నదే తడువుగా వీడియో కెమెరాకు పోజిస్తూ అతి దారుణంగా అమాయకుల పీకలను తెంపుతుంటాడు. అలా చేసే వ్యక్తిని 'జిహాదీ జాన్‌' అంటారు. ఇప్పుడు ఆ జిహాదీ జాన్‌ మారిపోయాడని సమాచారం. భారత సంతతికి చెందిన బ్రిటన్‌ పౌరుడు సిద్ధార్థ ధర్‌ ఇప్పుడు జిహాదీ జాన్‌గా మారిపోయాడని తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన అతడు ఇస్లాం మతంలోకి మారి అనంతరం ఐసిస్‌లో చేరడంతో అమెరికా తాజాగా అతడిని గ్లోబల్‌ టెర్రరిస్టుగా గుర్తించింది.

ప్రపంచవ్యాప్త ఉగ్రవాదుల జాబితాలో సిద్ధార్థను చేర్చింది. ప్రస్తుతం అతడే ఐసిస్‌లో జిహాదీ జాన్‌గా ఉంటూ అమాయకులను అతి దారుణంగా గొంతుకోసి చంపుతున్నాడట. ఇతడి గురించి సంక్షిప్త వివరాలు ఓసారి పరిశీలిస్తే.. సిద్ధార్థ తొలుత ఓ బ్రిటన్‌ హిందువు. ఇస్లాం మతంలోకి మారాక అతడి పేరును అబు రుమాయ్‌సాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌ టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌ అల్‌ ముహాజిరౌన్‌ అనే విభాగానికి నడిపిస్తున్న వారిలో కీలకంగా పనిచేస్తున్నాడు. బ్రిటన్‌లో ఓ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన అనంతరం సిరియాకు తన భార్య, పిల్లలతో కలిసి పారిపోయి ఐసిస్‌లో చేరాడు. 2015లో డ్రోన్‌ దాడిలో మహ్మద్‌ ఎమ్వాజీ(జిహాదీ జాన్‌) హతమవడంతో అతడి స్థానంలో సీనియర్‌ కమాండర్‌గా కొనసాగుతున్నాడు. 2016 నుంచి బందీలుగా ఉగ్రవాదులు పట్టుకున్న వారందరిని గొంతు కోసి చంపిన వ్యక్తి ఇతడే అని అమెరికా తాజాగా గుర్తించింది.

Advertisement
Advertisement