హోటల్‌పై భారీ కొండచరియ.. 30మంది బలి | Sakshi
Sakshi News home page

హోటల్‌పై భారీ కొండచరియ.. 30మంది బలి

Published Thu, Jan 19 2017 3:34 PM

హోటల్‌పై భారీ కొండచరియ.. 30మంది బలి

రోమ్‌: ఇటలీలో ప్రకృతి ప్రకోపానికి 30మంది బలైనట్లు తెలుస్తోంది. ఓ పర్వతం పక్కనే ఉన్న హోటల్‌పై ఓ భారీ కొండచరియ విరిగి పడటంతో వారంతా మృత్యువాత పడినట్లు సమాచారం. అంతకుముందు రోజు ఏర్పడిన భూకంపాలే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. ఇటలీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నాలుగుసార్లు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్ని ఈ భూప్రకంపనల కారణంగా కొన్ని క్షణాలపాటు వణికిపోయాయి.

అదే సమయంలో గ్రాన్‌ సాసో పర్వతం పక్కనే రిగోపియానో అనే హోటల్‌పై దాదాపు రెండు మీటర్ల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తుతో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో అందులో పనిచేసే సిబ్బంది, అతిథులు, ఇతరులు మొత్తం 30మంది వరకు దీనికింద పడి నలిగిపోయారు. ఇంకా ఎక్కువమందే చనిపోయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ పర్వతాల్లో గస్తీ కాసే పోలీసులు వెంటనే హెలికాప్టర్‌ ద్వారా అక్కడి చేరుకుని మృతదేహాలను వెలికి తీయడంతోపాటు గాయపడిన వారిని రక్షించే చర్యలు ప్రారంభించారు. ఆ మంచుకొండ దెబ్బకి ఆ హోటల్‌ పది మీటర్ల ముందుకు కదిలిందట.

Advertisement

తప్పక చదవండి

Advertisement