ఒక్క చేప ఖరీదు.. రూ. 78 లక్షలు! | Sakshi
Sakshi News home page

ఒక్క చేప ఖరీదు.. రూ. 78 లక్షలు!

Published Tue, Jan 5 2016 9:09 AM

ఒక్క చేప ఖరీదు.. రూ. 78 లక్షలు!

ఇదేమైనా బంగారం చేపా.. లేకపోతే దాని పొట్టలో వజ్రాలు ఉన్నాయా.. అదేమీ కాదు. అది అన్నింటిలాంటి మామూలు చేపే. కాకపోతే 200 కిలోల బరువుంది. అయినా ఆ చేపను మాత్రం జపాన్‌లోని ఓ హోటల్ చైన్ యజమాని ఏకంగా రూ. 78 లక్షలు పెట్టి కొన్నాడు. అంటే, కిలో చేప ఖరీదు దాదాపు రూ. 39 వేలన్నమాట. సుషి జన్మై అనే రెస్టారెంటు చైను యజమాని కియోషి కిమురా ఈ ట్యూనా చేప మీద మనసు పడ్డాడు. టోక్యోలో అత్యంత ప్రసిద్ధి చెందిన చేపల మార్కెట్‌లో కొత్త సంవత్సరంలో జరిగిన తొలి వేలంపాటలో ఈ చేపను ఆయన పాడుకున్నాడు. అది అనుకున్నదాని కంటే కాస్త ఎక్కువ ఖరీదే పలికిందని, కానీ, దాని రంగు, రూపం, క్వాలిటీ.. అన్నీ చూస్తే మాత్రం అంత ధర పెట్టాలనే అనిపించిందని కిమురా చెప్పాడు. తన కస్టమర్లు సంతోషంగా ఉండాలనే అనుకున్నానని, అందుకే సుకిజి చేపల మార్కెట్‌లో తొలి ట్యూనా చేపను తానే తెచ్చానని అన్నాడు.

నీలిరంగు తోక ఉన్న ఈ చేపలంటే జపనీయులకు ఎంత మక్కువ. గత సంవత్సరం నిర్వహించిన వేలంలో పలికిన ధరకు మూడురెట్లు ఎక్కువ ధర పెట్టి కిమురా ఈ చేపను కొన్నాడు. అయితే.. ఈయన ఇలా చేపలకు ఎక్కువ ధర పెట్టడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు 2013లో ఏకంగా రూ. 12 కోట్లు వెచ్చించి 222 కిలోల బరువున్న ట్యూనా చేపను కొన్నాడు. దాంతో పోలిస్తే ఇప్పుడు పెట్టిన డబ్బు చాలా తక్కువే. అప్పట్లో పోటీ రెస్టారెంటు యజమాని కావాలని పాట పెంచాడని అంటారు. తొలి వేలంలో ఎక్కువ డబ్బు పెట్టడం జపనీయులకు అలవాటు. 'గోషుగి సోబా' అనే ఆచారం ప్రకారం ఇలా పెడతారు. ఎంత ఎక్కువ డబ్బు పెట్టి కొంటే, ఆ ఏడాది తమ వ్యాపారం అంత బాగుంటుందని వాళ్లు అనుకుంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement