Sakshi News home page

కలసికట్టుగా రక్షణ ఉత్పత్తి

Published Sat, Jul 9 2016 1:27 AM

కలసికట్టుగా రక్షణ ఉత్పత్తి - Sakshi

దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భేటీలో మోదీ ప్రతిపాదన
- ఇరు దేశాల అవసరాలు తీరటంతో పాటు ప్రపంచ డిమాండ్‌నూ అందుకోవచ్చు
- గనుల తవ్వకం, ఖనిజవనరుల రంగాల్లోనూ సహకారం మరింత బలోపేతం
 
 ప్రిటోరియా : భారత్, దక్షిణాఫ్రికాలు తమ సంప్రదాయ బంధాలను విస్తరిస్తూ.. కీలకమైన రక్షణ ఉత్పత్తి, తయారీ, గనులు, ఖనిజవనరుల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఉగ్రవాదంపై పోరాటంలో, అంతర్జాతీయ వేదికలపై అంశాలలో క్రియాశీకలంగా సహకరించుకోవాలనీ తీర్మానించాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు, వ్యాపార అనుసంధానాలు, వాణిజ్యం, పెట్టుబడులే కాకుండా.. రక్షణ, భద్రత రంగాల్లోనూ ఇరు దేశాలూ భాగస్వాములు కావచ్చునని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమాతో పేర్కొన్నారు. 

భారత్‌లో రక్షణ రంగం సంపూర్ణంగా మారిపోతోందని అది అద్భుత అవకాశాలను అందిస్తోందని చెప్పారు. ప్రధాని ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికా చేరుకున్నారు. ప్రిటోరియాలో జుమాతో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మొత్తంగా సమీక్షించారు. రక్షణ పరికరాలు, వేదికల తయారీకి భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానమంటూ.. ఇరు దేశాల అవసరాలను తీర్చుకోవటం కోసమే కాకుండా.. ప్రాంతీయంగానూ ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న డిమాండ్‌కు స్పందించటానికి కూడా భారత్, దక్షిణాఫ్రికాలు చేతులు కలపాలని మోదీ పేర్కొన్నారు. ఆయుధాలను ఎగుమతి చేసే దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఒక ముఖ్యమైన దేశం కావటం గమనార్హం.

అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తుకు దక్షిణాఫ్రికా మద్దతు ఇవ్వటం పట్ల ప్రధాని ఈ సందర్భంగా జుమాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు అగ్రనేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ గురించి ప్రస్తావిస్తూ ఆయన భారత్‌కు ఎంత చెందుతాడో దక్షిణాఫ్రికాకూ అంతే చెందుతాడని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ భూమి మీద నడచిన అతి గొప్ప వ్యక్తులు ఇద్దరు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలకు నివాళులు అర్పించటానికి ఈ పర్యటన ద్వారా నాకు అవకాశం వచ్చింది’’ అని చెప్పారు. ఉగ్రవాదం అనేది సమాజపు పునాదులపైనే దాడి చేస్తోందంటూ.. దానిపై క్రియాశీలక సహకారంతో పోరాడాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్లు మోదీ తెలిపారు.

దక్షిణాఫ్రికాలో చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధి కోసం భారత్ తన సామర్థ్యాలను పంచుకోవటానికి సిద్ధంగా ఉందన్నారు. ఐబీఎస్‌ఏ (ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి), బ్రిక్స్‌ల ద్వారా అంతర్జాతీయ ఎజెండాను రూపొందించటంలో ఇరు దేశాలూ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షుడు జుమాను ఆహ్వానించటం కోసం తాను వేచిచూస్తున్నానని చెప్పారు. మోదీని ఆయన రెండో ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు జుమా పేర్కొన్నారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై తాము చర్చించామని.. అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేస్తామని చెప్పారు.
 
8 ఎంఓయూలపై సంతకాలు

ఐబీఎస్ హైదరాబాద్‌తో గోర్డన్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం
 
ప్రిటోరియా : భారత్, దక్షిణాఫ్రికాలు విస్తృత రంగాల్లో సహకారం కోసం 8 అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మోదీ పర్యటన సందర్భంగా జరిగిన దక్షిణాఫ్రికా- ఇండియా సీఈఓల వేదిక సమావేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించటం లక్ష్యంగా ఈ ఒప్పందాలు చేసుకున్నారు.

► హిందుస్తాన్ జింక్ లిమిటెడ్.. భారత్‌లో భూగర్భ గనుల తవ్వకాల నిమిత్తం రాక్ సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధి, సరఫరా కోసం మినోవా ఆఫ్రికా సంస్థతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ఆధునిక యాంత్రీకృత భూగర్భ గనుల తవ్వకాల్లో భద్రత, పరికరాల సరఫరా, నిర్వహణ కోసం ఫెరెమెల్ సంస్థతో మరో ఒప్పందం చేసుకుంది.  ళీ ఎంఎంఐ హోల్డింగ్స్, ఆదిత్య బిర్లా నువో సంస్థలు భారత్‌లో ఆరోగ్య-బీమా రంగంలో జాయింట్ వెంచర్ కోసం ఎంఓయూ కుదర్చుకున్నాయి.
► భారత్‌కు చెందిన వ్యర్థ, నీటి శుద్ధి సంస్థ ఐయాన్ ఎక్స్‌చేంజ్ సేఫిక్ దక్షిణాఫ్రికాలో భారీ స్థాయి నీటి, వ్యర్థ శుద్ధి ప్రాజెక్టుల కోసం స్టెఫానుటి స్టాక్స్ ఎస్‌ఏతో జట్టుకడుతుంది.  ళీ భారత్‌లో భూతల ఎలక్ట్రానిక్ రక్షణ వ్యవస్థల ఉత్పత్తి చేయటం కోసం ఎస్‌ఏఏబీ గ్రినటెక్ డిఫెన్స్ సంస్థ టాటా పవర్ సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ళీ భారత రైల్వేల కోసం దెబ్బతిన్న రైల్వేలను పసిగట్టే అల్ట్రాసోనిక్ వ్యవస్థలను ఉత్పత్తి చేయటానికి, సాంకేతికత బదిలీకి పయనీర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఇండియాకు ఆర్మ్స్‌కార్ సంస్థకు మధ్య ఎంఓయూ కుదిరింది.
► సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, విద్యార్థుల సందర్శన, ఉపాధ్యాయుల సందర్శన, సంయుక్త పరిశోధనల కోసం గోర్డన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ సైన్స్ సంస్థ.. ఐఎస్‌బీ హైదరాబాద్‌తో ఎంఓయూ చేసుకుంది ళీ డర్బన్‌లోని డ్యూబ్ ట్రేడ్ పోర్ట్‌కు, సిప్లా ఇండియా సంస్థకు మధ్య అతి పెద్ద ఎంఓయూ కుదిరింది. దీనికింద 130 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్ల వ్యయంతో స్పెషల్ ఎక్స్‌పోర్ట్ జోన్‌లో బయోసిమిలర్ ప్లాంటును నెలకొల్పనున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement