అరుణగ్రహంపైకి మానవుడు.. మరో బిగ్ సక్సెస్! | Sakshi
Sakshi News home page

అంగారక యాత్రలో మరో ముందడుగు

Published Tue, Dec 5 2017 1:23 PM

NASA Mars 2020 Mission Performs First Supersonic Parachute Test - Sakshi

న్యూయార్క్‌ : 2020 సంవత్సరం నాటికి అంగారక గ్రహంపైకి మానవుడిని తీసుకెళ్లేందుకు నాసా తీవ్రంగా కషి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రలో మానవ రాకెట్‌ను సురక్షితంగా అంగారక గ్రహం ఉపరితలంపై దించడం ఓ కీలక ఘట్టం. దీనికి ఉపయోగపడే సూపర్‌సోనిక్‌ పారాషూట్‌ను నాసా అభివద్ధి చేయడమే కాకుండా దాన్ని విజయవంతంగా పరీక్షించి విజయం సాధించింది. అంగారక గ్రహంపై ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించిన వర్జీనియాలోని ‘వాలప్స్‌ ఫ్లైట్‌ ఫెసిలిటీ’లో ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను ‘అడ్వాన్స్‌డ్‌ సూపర్‌ సోనిక్‌ పారాషూట్‌ ఇన్‌ఫ్లేషన్‌ రీసర్చ్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ (ఏఎసీపీఐఆర్‌)గా వ్యవహరించింది. 

రెండు దశల్లో విడిపోయే ఛోదక శక్తి ద్వారా అంగారక గ్రహానికి ప్రయాణించే సామర్థ్యం కలిగిన రాకెట్‌తో నైలాన్, టెక్నోరా, కెవ్‌లర్‌ పదార్థాలతో తయారుచేసిన సూపర్‌ సోనిక్‌ పారాషూట్‌ను నాసా ప్రయోగించింది. ధ్వని వేగం కన్నా 1.8 రెట్ల వేగంతో, అంటే గంటకు 1300 మైళ్ల వేగంతో ప్రయాణించిన రాకెట్‌ను ఈ పారాషూట్‌ అతి జాగ్రత్తగా లక్ష్యిత ప్రాంతంలో దించింది. ఈ పారాషూట్‌ ల్యాండింగ్‌ సందర్భంగా 35 వేల పౌండ్ల లాగుడు శక్తిని ఉత్పత్తి చేసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

అంగారక గ్రహంపైకి మానవ యాత్ర మిషన్‌ను చేపట్టాలంటే ధ్వనికన్నా మూడింతలు వేగంగా ప్రయాణించే రాకెట్‌ కావాలి. అంతటి సామర్థ్యం కలిగిన రాకెట్లను నాసా ఇప్పటికే అభివద్ధి చేసింది. ఈ రాకెట్‌ అంగారక గ్రహం వాతావరణంలోకి వెళ్లాక రాకెట్‌ను వెనక్కి లాగి పట్టుకొని అతి జాగ్రత్తగా దాన్ని దిందే సామర్థ్యం పారాషూట్‌కు ఉండాలి. ఎలాంటి సమస్యలు లేకుండా పారాషూట్‌ ప్రయోగం విజయవంతమైనందున 2020లో చేపట్టే మానవ యాత్ర మిషన్‌ కూడా విజయవంతం అవుతుందని నాసా శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. 

అంగారక యాత్రలో మరో ముందడుగు

Advertisement

తప్పక చదవండి

Advertisement