హైడ్రోజన్ బాంబును పరీక్షించాం! | Sakshi
Sakshi News home page

హైడ్రోజన్ బాంబును పరీక్షించాం!

Published Wed, Jan 6 2016 9:12 AM

హైడ్రోజన్ బాంబును పరీక్షించాం!

ఉత్తరకొరియా 'బాంబు' లాంటి వార్తను పేల్చింది. అణుబాంబు కంటే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ప్రభావంతో.. ఈశాన్య ఉత్తరకొరియాలో 5.1 తీవ్రతతో 'కృత్రిమ భూకంపం' సంభవించింది. అంతకుముందు.. అందరూ ఉత్తరకొరియాలో సంభవించింది భూకంపమా.. కృత్రిమ భూకంపమా లేదా అణ్వస్త్ర పరీక్షా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దీనిపై పెద్దస్థాయిలో చర్చ మొదలవ్వడంతో.. చివరకు ఉత్తరకొరియానే అధికారికంగా అసలు విషయాన్ని ప్రకటించింది. ఇటీవలి కాలంలోఅమెరికాను సైతం సవాలు చేస్తున్న ఉత్తరకొరియా.. ఏకంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే మొదటిసారి.

ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ బుధవారం ఉదయం వెల్లడించింది. అక్కడ 2013లో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అదే స్థలంలో కృత్రిమ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తరకొరియాలో సంభవించినది భారీ పేలుడు కావచ్చని చైనా భూకంప గుర్తింపు కేంద్రాలు అనుమానిస్తున్నాయి. అది కృత్రిమ భూకంపం అని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది.

సత్తా చాటేందుకే..
మరో రెండు రోజుల్లో.. అంటే ఈనెల 8వ తేదీన కిమ్ జోంగ్ ఉన్ పుట్టినరోజు ఉండటంతో తమ సత్తాను నిరూపించుకోడానికి, తమవద్ద అణ్వస్త్రాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసిందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement