జమాత్‌పై పాక్ నిషేధం | Sakshi
Sakshi News home page

జమాత్‌పై పాక్ నిషేధం

Published Fri, Jan 23 2015 1:46 AM

Pakistan freezes Jamaat-ud-Dawa assets

 ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. పాక్‌లో ని ఉగ్రవాద గ్రూపులపై ఎట్టకేలకు నిషేధం విధించింది. 2008లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా(జేయూడీ), హక్కానీ నెట్‌వర్క్‌లతో సహా పలు ఉగ్రవాద సంస్థలపై వేటు వేసింది. సయీద్ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. పలు ఉగ్రవాద గ్రూపులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, కొన్ని గ్రూపులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్న పాక్ తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. నిషేధాన్ని ధృవీకరిస్తూ పాక్ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించినట్లు వెల్లడిస్తూనే.. ఐరాస నిర్దేశం మేరకే  ఈ చర్యలు తీసుకున్నామని, ఈ విషయంలో అమెరికా సహా ఎవరి ఒత్తిడి లేదని పేర్కొంది. ఉగ్రవాద సంస్థల బ్యాంకు లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు కూడా రేడి యో పాకిస్తాన్ వెల్లడించింది.  భారత గణతంత్ర దినోత్సవాల్లో ఒబామా పాల్గొంటున్న నేపథ్యంలో పాక్ చర్యలు చేపట్టడం గమనార్హం.
 
 నిషేధిత జాబితాలో పలు సంస్థలు
 నిషేధిత సంస్థల జాబితాలో జేయూడీతో పాటు ఫలా-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్‌ఐఎఫ్), హర్కతుల్ జిహాద్ ఇస్లామీ, హర్కతుల్ ముజాహిదీన్, ఉమ్మా తమీర్-ఇ-నౌ వంటి సంస్థలు ఉన్నాయి. హఫీజ్ సయీద్‌ను పట్టుకోడానికి అమెరికా ఇప్పటికే దాదాపు రూ. 60 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న సయీద్.. తరచూ బహిరంగ సభల్లో పాల్గొంటూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్ర కార్యకలాపాలు ఆపం: జేయూడీ.. తమ సంస్థపై పాక్ నిషేధం విధించినా సరే తమ కార్యకలాపాలను ఆపేదిలేదని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. గతంలోనే తమ సంస్థ మతబోధనలు, కార్యకలాపాలకు అనుకూలంగా సుప్రీం కోర్టు, లాహోర్ హైకోర్టులు తీర్పులు చెప్పాయని జేడీయూ అధికార ప్రతినిధి యాహా ముజాహిదీన్ గురువారం వ్యాఖ్యానించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement