బోయ్ ఫ్రెండ్ పై యాసిడ్ పోసింది! | Sakshi
Sakshi News home page

బోయ్ ఫ్రెండ్ పై యాసిడ్ పోసింది!

Published Thu, Jun 16 2016 7:14 PM

బోయ్ ఫ్రెండ్ పై యాసిడ్ పోసింది! - Sakshi

ముల్తాన్: సాహసం చేసి గెలిచిన మహిళను వీరనారి అంటాం. కానీ, ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకుని, వారితో విడిపోయి ఇంకో వ్యక్తిని ప్రేమించి.. అతడు పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో అతనిపై యాసిడ్ పోసిన ఈ మహిళను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. పాకిస్తాన్ లోని ముల్తాన్‌లో సంభవించిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె బోయ్ ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మోమ్లీ మాయ్ అనే నగరానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన సద్దాఖ్ అలీ (25) గత కొద్ది ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ ఇంతకుముందు విడివిడిగా పెళ్లిళ్లు అయ్యాయి. కానీ, ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం, కలిసి జీవిస్తున్నాం.. ఇకనైనా తనను రెండో భార్యగా చేసుకోవాలని మోమ్లీ అలీపై ఒత్తిడి తీసుకురావడంతో, పెళ్లి చేసుకోనని అతడు తెగేసి చెప్పేశాడు. ముస్లింలలో బహుభారత్వం చట్టబద్ధమే అయినా.. పెళ్లయిన మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందే. అలీ ఇదే విషయాన్ని సాకుగా చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాడు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య పెళ్లి విషయమై పెద్ద గొడవ జరిగింది. కోపంతో రగిలిపోయిన మోమ్లీ అలీపై యాసిడ్ తో దాడి చేసింది. బాధితుడు వెనక్కు తిరగడంతో అదృష్టవశాత్తు ముఖం మీద పడకుండా శరీరం మీద పడి తీవ్ర గాయాలయ్యాయి.

దాదాపు 60 శాతానికి పైగా శరీరంలో యాసిడ్ గాయాలయ్యాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అలీని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మామ్లీపై కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతాయని కానీ, ఈ కేసులో మాత్రం ఒక మహిళ పురుషుడిపై యాసిడ్ దాడి చేసిందని పేర్కొన్నారు. కాగా, యాసిడ్ ను పంజాబ్ ప్రావిన్సులో వ్యవసాయంలో విరివిగా ఉపయోగిస్తారు.

Advertisement
Advertisement