రియాద్ : సౌదీ అరేబియా యువరాజులలో ఒకరైన మన్సూర్ బిన్ మోక్రెన్ చనిపోయి 24 గంటలు గడవక ముందే మరో యువరాజు మృతి చెందడం పలు అనుమానాలకు దారి తీసింది. ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్ క్రాష్ కావడంతో అసిర్ ప్రావిన్స్కి ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్గా ఉన్న మన్సూర్ బిన్ మోక్రెన్ దుర్మరణం చెందాడు. మన్సూర్తో పాటు కొందరు ఉన్నతాధికారులు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. రెండు మసీదులకు మోక్రెన్ పెద్దగా వ్యవహరించేవారు.
హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు తెలుసుకోకముందే, ఆ మరుసటి రోజు (సోమవారం) సౌదీ అరేబియా రాజు ఫహద్ చిన్న కుమారుడు అబ్దుల్ అజిజ్ (44)పై కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా కొన ఊపిరితో ఉన్న యువరాజు అజిజ్ మరణించినట్లు అజ్ మస్డార్ నెటవర్క్ మీడియా వెల్లడించింది. అరెస్ట్ చేయడానికి వెళ్లగా జరిపిన కాల్పుల్లో అజిజ్ చనిపోయాడని మరో స్థానిక మీడియాలో రావడం పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులు ఇటీవల అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో మృతిచెందిన యువరాజు అజిజ్ తండ్రి, రాజు ఫహద్ కూడా ఉన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తున్న క్రమంలో వరుసగా యువరాజుల మరణాలు సంభవించడం ప్రిన్స్ సల్మాన్ పై ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.