రోజుకు 150 సార్లు సెల్‌ఫోన్‌ను.. | Sakshi
Sakshi News home page

రోజుకు 150 సార్లు సెల్‌ఫోన్‌ను..

Published Sun, May 20 2018 3:20 PM

Smartphone Using Becomes Addiction To Indian Users - Sakshi

లక్నో: నేటి ప్రపంచంలో సెల్‌ఫోన్‌ ఓ అవసరంగా కాదు.. వ్యసనంలా మారింది. ఒక పూట తిండిలేకపోయినా ఉండగలరేమో గాని సెల్‌ఫోన్‌ వాడకుండా ఉండలేకపోతున్నారు. ఇక యుక్త వయస్సులో ఉన్న వాళ్లు ఫోన్‌కు బానిసలయ్యారని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని కొన్ని సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులు ప్రతిరోజూ కనీసం 150 సార్లు సెల్‌ఫోన్‌ను వాడుతున్నారని పరిశోధకులు తేల్చారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.

‘‘స్మార్ట్‌ ఫోన్‌ డిపెండెన్సీ, హెడోనిజమ్‌ అండ్‌ పర్‌చేజ్‌ బిహేవియర్‌ : ఇంప్లికేషన్‌ ఫర్‌ డిజిటల్‌ ఇండియా ఇన్సియేటివ్‌ ’’ పేరిట ఈ సర్వేను నిర్వహించారు.  దాదాపు 20 యూనివర్శిటీలకు చెందిన 200 మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇందులో 26 శాతం మంది ఇతరులతో మాట్లాడుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్‌ ఉపమోగిస్తామని తెలిపారు. మిగిలిన వారు రోజుకు కనీసం 150 సార్లు సెల్‌ వాడుతున్నారని తేలింది. సెల్‌ఫోన్‌ అతిగా వాడటం వల్ల అది వారి ఆరోగ్యం, చదువులపై ప్రభావం చూపింది.

2017 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో 63 శాతం మంది ఒక రోజులో 7 గంటలు సెల్‌ఫోన్‌ వాడుతున్నారని, 23శాతం మంది కనీసం 8 గంటల సేపు ఫోన్‌ వాడుతున్నట్లు తేలింది. సెల్‌ఫోన్‌ ఒక అవసరంగా ఉన్నంత వరకు ఎటువంటి ఢోకా లేదని వ్యసనంలా మారితే భారీ నష్టం తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement
Advertisement