వాఘా ఆత్మాహుతి బాంబర్ ఇతడే!! | Sakshi
Sakshi News home page

వాఘా ఆత్మాహుతి బాంబర్ ఇతడే!!

Published Fri, Nov 14 2014 5:01 PM

వాఘా ఆత్మాహుతి బాంబర్ ఇతడే!! - Sakshi

భారత, పాకిస్థాన్ దేశాల మధ్య వాఘా సరిహద్దు ప్రాంతంలో తనను తాను పేల్చేసుకుని.. 61 మంది మరణానికి కారకుడైన 25 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్ ఫొటోను పాకిస్థాన్ తాలిబన్ గ్రూపు విడుదల చేసింది. జమాత్ ఉల్ అహ్రార్ అనే తాలిబన్ గ్రూపు ఈ ఫొటో, వివరాలు బయటపెట్టింది. హనీఫుల్లా అలియాస్ హమ్జా అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు ఒమర్ ఖొరసానీ నేతృత్వంలోని జమాతుల్ అహ్రార్ గ్రూపు వెల్లడించింది.

సాయంత్రం సమయంలో పతాకాలను అవనతం చేసిన కొద్ది సేపటికి ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. మొహ్మాండ్ గిరిజన ప్రాంతంలోని ఓ పట్టణానికి చెందిన హనీఫుల్లా.. సరిగ్గా పెరేడ్ కాంప్లెక్సు గుమ్మం ఎదుటే తనను తాను పేల్చేసుకున్నాడు. దాంతో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలతో సహా 61 మంది మరణించారు, 110 మంది గాయపడ్డారు.

త్వరలోనే తాము ఈ దాడికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేస్తామని పాక్ తాలిబన్ గ్రూపు చెప్పింది. అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని ఫతా గిరిజన ప్రాంతంలో గిరిజనులు, తాలిబన్లపై జరుగుతున్న సైనిక చర్యకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు తెలిపింది.

Advertisement
Advertisement