అమర్‌నాథ్ దాడి: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్ దాడి: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్

Published Sun, Aug 6 2017 7:56 PM

అమర్‌నాథ్ దాడి: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ - Sakshi

శ్రీనగర్: గత నెలలో జమ్ముకాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులకు సాయం చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ఆదివారం వెల్లడించారు. తమ విచారణలో ముగ్గురు నిందితులు పూర్తిగా సహకరిస్తున్నారని, త్వరలోనే కాల్పులకు పాల్పడ్డ లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తామని చెప్పారు.

బిలాల్ అహ్మద్ రేషి, ఐజాజ్ వాగే, జహూర్ అహ్మద్ అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు లష్కర్ గ్రూపునకు చెందిన నలుగురు టెర్రిరిస్టులకు ఖుద్వానీ, శ్రీగుఫ్ఫారాలో ఆశ్రయం కల్పించారు. వీరి వద్ద ఆశ్రయం పొందిన ఆ ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని వెళ్తున్న యాత్రికుల బస్సుపై అనంతనాగ్‌ జిల్లాలో జూలై 10న విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. అదే రోజు ఆరుగురు భక్తులు మృతిచెందగా, చికిత్స పొందతూ మరో ఇద్దరు యాత్రికులు చనిపోయారు.

ఈ దాడి కేసులో ఇప్పటికే ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను గతవారం పోలీసులు మట్టుపెట్టారు. హతమైన ఇద్దరిలో టాప్ కమాండర్ అబు దుజానా ఉన్నాడు. నేడు పోలీసులు అరెస్ట్ చేసిన బిలాల్ అహ్మద్ అన్న అదిల్ లష్కర్ ఉగ్రవాది కాగా, ఈ ఏడాది భద్రతా సిబ్బంది కాల్పుల్లో హతమయ్యాడు.

Advertisement
Advertisement