ఈ - ముక్కు చెబితే తినొచ్చు! | Sakshi
Sakshi News home page

ఈ - ముక్కు చెబితే తినొచ్చు!

Published Tue, May 27 2014 12:29 AM

ఈ - ముక్కు చెబితే తినొచ్చు! - Sakshi

వాషింగ్టన్: ఏదో హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్లారు.. మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేశారు.. కానీ, ఆ ఆహారం పాడైపోయిందేమోనని అనుమానం వచ్చింది.. రుచి బాగానే ఉన్నా, తిన్నాక ఏమైనా అయితే..!? ఇలాంటి సమయాల్లో బాగా తోడ్పడే ‘ఈ-ముక్కు (ఎలక్ట్రానిక్ ముక్కు)’ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెరెస్’ అని పేరుపెట్టిన ఈ పరికరాన్ని ఆహారానికి దగ్గరగా పెట్టగానే.. దాని నుంచి వెలువడే రసాయనాలు, అమ్మోనియా స్థాయిని గుర్తించి దానిని తినొచ్చో లేదో చెప్పేస్తుంది.

అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ‘పెరెస్’తో మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాల తాజాదనాన్ని దీని సహాయంతో సులువుగా గుర్తించవచ్చు. ఈ పరికరంలోని నాలుగు సెన్సర్లు.. ఆహారం ఉష్ణోగ్రత, అందులోని తేమ, దాని నుంచి వెలువడే అమ్మోనియా, ఇతర ప్రమాదకర రసాయనాలను గుర్తించి.. బ్లూటూత్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌కు పంపుతాయి. ఫోన్‌లోని అప్లికేషన్ దీనిని విశ్లేషించి.. ఆ ఆహారాన్ని తినవచ్చో, లేదో చెబుతుంది.

Advertisement
Advertisement