రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Published Tue, Jan 9 2018 11:09 AM

three killed in road accident - Sakshi

చాగలమర్రి/ఆలూరు/ఎమ్మిగనూరు రూరల్‌:  జిల్లాలో సోమవారం వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. చాగలమర్రి మండలం చిన్నబోధనం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సుమో ఢీకొనడంతో యామా చిన్న లక్ష్మిరెడ్డి(55) అక్కడిక్కడే మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున అంకిరెడ్డి పల్లెలోని తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఈయన బస్సుకోసం మెట్ట వద్దకు వచ్చాడు. జాతీయ రహదారి దాటుతుండగా ఆళ్లగడ్డ వైపు నుంచి తిరుపతి వైపునకు వెళ్తున్న ఏపీ 21 బీకే 2777 సుమో ఢీకొంది. దీంతో లక్ష్మిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద వార్త తెలియగానే గ్రామస్తులంతా జాతీయ రహదారి వద్దకు చేరుకొని మృతదేహంతో అక్కడే రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు జాతీయ రహదారిపై బారులు దీరాయి. విషయం తెలసుకొన్న సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సంఘటనా స్ధలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. సర్వీస్‌ రోడ్డు నిర్మించడంతోపాటు బస్సు సర్వీసు గ్రామంలోనికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement