మెగాఫోన్‌పై పట్టు ఏదీ? | Sakshi
Sakshi News home page

మెగాఫోన్‌పై పట్టు ఏదీ?

Published Mon, Jun 9 2014 11:20 PM

మెగాఫోన్‌పై పట్టు ఏదీ?

తమిళ సినిమా : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు.  అయితే సినిమా రంగంలో ప్రధాన శాఖ అయిన దర్శకత్వంలో మహిళ ప్రతిభ మెరుగు పడాల్సి ఉంది. మెగాఫోన్ పట్టడంలో ప్రతిభను కనబరచలేకపోతున్నారు. అయితే ఈ శాఖలో సాధించిన వారు కూడా కొందరు ఉన్నారు. ప్రఖ్యాత దివంగత నటీమణులు టి.పి.రాజ్యలక్ష్మి, అష్ఠావధాని పి.భానుమతి రామకృష్ణ, మహానటి సావిత్రి, గిన్నిస్ రికార్డు సాధించిన విజయ నిర్మల వంటి వారు దర్శకులుగా ఎంతగానో సాధించి నేటితరం మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఆ తరువాత తరం మహిళా దర్శకులు మాత్రం అంతగా రాణించలేకపోతున్నారు. సీనియర్ నటీమణులు లక్ష్మీ, శ్రీప్రియ, జయదేవి తదితరులు దర్శకత్వ రంగంలో సాధించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. కొందరు మాత్రం ఊహించిన విజయాలు అందకపోవడంతో మెగాఫోన్‌కు దూరమయ్యారు. మరి కొందరు మాత్రం అందులో సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారు.
 
 సీనియర్ నటీమణులు సుహాసిని ఇందిరా చిత్రంతో, రేవతి మిత్రామై ఫ్రెండ్‌తో, సుష్మా అహుజా ఉయిరుక్కు ఉయిరాగ చిత్రాలతో దర్శకత్వ రంగంలోకి ప్రవేశించినా ఆ చిత్రాలు అంతగా విజయం సాధించకపోవడంతో దర్శకత్వానికి స్వస్తి చెప్పారు. మరి కొందరు మహిళలు కూడా ఇలాంటి నిరాశకు గురయ్యారు. అనితా ఉదిప్ (కుళిర్ 100 డిగ్రీ), రేవతి ఆరు, (జూన్ ఆరు), జానకి విశ్వనాథన్ (కుట్టి), శారదా రామనాథన్ (సింగారం), ప్రియ.వి (కండనాళ్ ముదల్), మధుమిత  (వల్లమైతారాయో), సుధ (ద్రోహి), అంజనా (వెప్పం), జె.ఎస్. నందిని (తిరు తిరు తురు తురు) వంటి దర్శకుల్లో చాలా మంది మరో ప్రయత్నం చెయ్యలేకపోయారు.
 
 కార ణం ఆ చిత్రాలు విజయాలకు చేరువకాలేకపోవడమే. శారదా విశ్వనాథన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పుదియ తిరుపుంగళ్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలం అయినా విడుదలకాలేదు. కన్నామూచ్చి ఏనడా చిత్రం తరువాత ప్రియ.వి, కొలకొలయా ముం దిరికా చిత్రం తరువాత మధుమిత తదుపరి ప్రయత్నం చెయ్యలేదు. అదే విధంగా తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నాన్ ఎన్నుళ్ ఇల్లై చిత్రాన్ని తెరకెక్కించిన సీనియర్ నటి జయచిత్ర ఇప్పటి వరకు మరో చిత్రం చెయ్యలేదు. అలాగే నందకి చిత్ర దర్శకురాలు విజయ పద్మ, చట్టం ఒరు ఇరుట్టరై (రీమేక్) దర్శకురాలు స్నేహ ప్రింటో, చంద్ర చిత్ర దర్శకురాలు రూపా అయ్యర్ తొలి ప్రయత్నంతోనే సరిపెట్టుకున్నారు.
 
   మరో ప్రయత్నం
 కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీ రామకృష్ణన్ ఆరోహణం చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ చిత్రం పలువురి ప్రశంసలు పొందడంతో ప్రస్తుతం నెరింగి వా ముత్తమిడాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 3 చిత్రంతో మెగా ఫోన్ పట్టిన రజనీకాంత్ పెద్దకూతురు నటుడు ధనుష్ భార్య ఐశ్వర్య ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అనూహ్య ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం గౌతమ్ కార్తిక్ హీరోగా వై రాజా వై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆమె సోదరి సౌందర్య తన తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కోచ్చడయాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్‌లో రూపొందిన ఈచిత్రం సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తానంటున్నారామే. అలాగే యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్, భార్య కృతిక తొలి ప్రయత్నంగా వడ చెన్నై చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రం మంచి రిజల్ట్‌నే సాధించడంతో ఆమె మరో ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుతున్నారు. నటి అంబికా కూడా మలయాళంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడా చిత్రాన్ని నిళరు పేరుతో తమిళంలోకి అనువాదం చేస్తున్నారు.
 
    సక్సెస్ కోసం..
 దర్శకురాలిగా అవతారమెత్తి సక్సెస్ కోసం వేచి ఉన్న నటీమణుల్లో నటి రోహిణి, బృందా దాస్, షకిల్ తదితరులు ఉన్నారు. నటి రోహిణి అప్పావిన్ మీసై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బృందాదాస్ హాయ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శృంగార తార షకీలా తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నృత్య దర్శకురాలు, నటుడు ప్రకాష్ రాజ్ భార్య అయిన బోనివర్మ, నటి ఐశ్వర్య, నటుడు విష్ణువిశాల్ అర్ధాంగి రజిని నటుడు పార్తిపన్ కూతురు కీర్తన, నటి సిమ్రాన్, బేబి షాలిని తదితరులు త్వరలో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు.
 
 ఇలా పలువురు మహిళలు దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్నా, సరైన సక్సెస్‌లను రాబట్టుకోలేకపోతున్నారు. అం దుకు కారణం ప్రస్తుతం సినిమా ఖర్చు కోట్లు దాటింది. అలా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలంటే కమర్షియల్ చిత్రాల వల్లే సాధ్యం అవుతుంది. అలాంటి ఫార్ములా చిత్రాలను మహిళా దర్శకత్వంలో సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోందని ఎవరయినా ఆ విధంగా చిత్రం చేసి విజయం సాధిస్తే మహిళా దర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement