వాళ్లతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా..! | Sakshi
Sakshi News home page

వాళ్లతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా..!

Published Fri, Aug 7 2015 11:47 PM

వాళ్లతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా..!

‘‘ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించిన ‘ఓ మై గాడ్’ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ‘ఆల్ ఈజ్ వెల్’ వంటి మంచి కథతో ఆయన నన్ను కలిశారు’’ అని హీరో అభిషేక్ బచ్చన్ చెప్పారు. అభిషేక్ బచ్చన్, రిషికపూర్, అశిన్, సుప్రియా పాథక్ ముఖ్య తారలుగా రూపొందిన ‘ఆల్ ఈజ్ వెల్’ ఈ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అభిషేక్, ఉమేశ్ పాల్గొన్నారు. ఈ చిత్రకథ రాసుకున్న తర్వాత శ్రవణ్‌కుమార్ పాత్రకు అభిషేక్ తప్ప వేరే ఎవరూ సూట్ కారనుకున్నానని, ఆయన తండ్రిగా రిషి కపూర్ నటిస్తేనే బాగుంటుందని అనుకున్నానని దర్శకుడు తెలిపారు.

తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని కూడా అన్నారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ - ‘‘ఇది మంచి కామెడీ ఎంటర్‌టైనర్. చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా’’ అన్నారు. మీకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అని అభిషేక్‌ని అడిగితే - ‘‘నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ సందర్భంలో షారుక్ ఖాన్‌ని కలిశాను. అప్పుడాయన్ను ‘మీ డ్రీమ్ రోల్ ఏంటి?’ అనడిగితే.. ‘‘అసలు నేనీ స్థాయికి వస్తానని అనుకోలేదు. వచ్చాను. చేసే ప్రతి పాత్రను నా డ్రీమ్ రోల్‌లానే భావిస్తాను’’ అన్నారు.

ఇప్పుడు నేనూ అదే చెబుతున్నా. ప్రతి పాత్రా నాకు డ్రీమ్ వంటిదే’’ అన్నారు. మీ నాన్నగారు అమితాబ్ బచ్చన్, మీరు, మీ భార్య. మీ ముగ్గురూ కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు? అంటే, ‘‘నాన్నతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా. భార్యతో సినిమా అంటే కూడా అంతే. కానీ, రచయితలు కథ తయారు చేయాలి కదా’’ అని అభిషేక్ చెప్పారు.

Advertisement
Advertisement