విశాల్‌తో రొమాన్స్‌కు సై | Sakshi
Sakshi News home page

విశాల్‌తో రొమాన్స్‌కు సై

Published Thu, Nov 5 2015 2:42 AM

విశాల్‌తో రొమాన్స్‌కు సై - Sakshi

 తమిళసినిమా: నటి శ్రీదివ్య వరుస సక్సెస్‌లతో దూసుకెళుతోంది. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో విజయబాట పట్టిన ఈమె ఈ మధ్య విడుదలైన కాక్కిసట్టై చిత్రం వరకు విజయాలు అందుకుంది. ప్రస్తుతం కార్తీ వంటి స్టార్ హీరోతో కాస్మోరా చిత్రంలో నటిస్తోంది. ఈ తెలుగింటి ఆడపడుచు తాజాగా విశాల్‌తో నటించే లక్కీఛాన్స్‌ను కొట్టేసింది. కథాకళి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో విశాల్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కొంబన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ముత్తయ్య ఇప్పుడు విశాల్‌ను డెరైక్ట్ చేయనున్నారు.

ఈ చిత్రానికి మరుదు అనే పేరును ఖరారు చేశారు. దర్శకుడు ముత్తయ్య ఇంతకు ముందు చేసిన కుట్టిపులి, కొంబన్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన లక్ష్మిమీనన్‌నే ఈ మరుదు చిత్రంలో నాయకిగా నటింపజేయాలని భావించినట్లు సమాచారం. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నటి శ్రీదివ్యను ఆ అవకాశం వరించింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ పడి ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్న విశాల్, రాధారవి ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మరుదు చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement