అజిత్తో మరోసారి నటించనున్నానా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నటి త్రిష. నిత్యం ఏదో ఒక వార్తతో లైమ్టైమ్లో ఉందే తారల్లో ఈ చెన్నై చిన్నది ఒకరని చెప్పవచ్చు. ప్రేమ,పెళ్లి విషయాలను పక్కన పెట్టి స్నేహితురాళ్లతో జీవితాన్ని ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్న త్రిష గురించిన విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి సగటు ప్రేక్షకుడిలో ఎప్పుడూ ఉంటుంది. ఇక తను నటిస్తున్న, నటించబోయే చిత్రాల వివరాలను తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ త్రిష అభిమానుల్లో ఉండడం సహజమే కదా, అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం ద్విభాషా చిత్రం నాయకిలో నటిస్తున్నారు.
మరో పక్క ధనుష్కు జంటగా కొడి చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో ఆమె తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై కోలీవుడ్లో రకరకాల ప్రచారం జరుగుతోంది. యువ దర్శకుడు విఘ్నేష్ శివ దర్శకత్వంలో నటుడు విజయ్సేతుపతికి జంటగా కాత్తు వాకుల ఇరండు కాదల్ చిత్రంలో తన స్నేహితురాలు నయనతారతో కలసి నటించనున్నట్లు, అజిత్ 57వ చిత్రంలో నటి అనుష్కతో కలసి మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నారని రకరకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే అలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టే విధంగా త్రిష వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నాయకి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నానని అన్నారు. హారర్ ఇతివృత్తంతో కూడిన ఇందులో వినోదానికి పెద్ద పీట వేశామన్నారు. చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరున తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, తదుపరి ధనుష్తో నటిస్తున్న రాజకీయ నేపథ్యంలో సాగే కొడి చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఇవి మినహా తానే నూతన చిత్రాన్ని ఇప్పటికీ అంగీకరించ లేదని త్రిష స్పష్టం చేశారు.