జననాథన్ దర్శకత్వంలో అజిత్‌? | Sakshi
Sakshi News home page

జననాథన్ దర్శకత్వంలో అజిత్‌?

Published Thu, Jan 5 2017 1:53 AM

జననాథన్ దర్శకత్వంలో  అజిత్‌? - Sakshi

నటుడు అజిత్‌ చిత్రం అంటేనే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. కారణం ఆయన చిత్రాలు బ్రహ్మాండ విలువలతో పాటు, సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. వరుస విజయాలతో మంచి జోష్‌ మీద ఉన్న అజిత్‌ ప్రస్తుతం వీరం, వేదాళం చిత్రాల తరువాత శివ దర్శకత్వంలో మూడో సారి నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై త్యాగరాజన్ నిర్మిస్తున్న ఇందులో నటి కాజల్‌అగార్వల్‌ నాయకిగా నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో కమలహాసన్  రెండో కూతురు అక్షరహాసన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం పోరాట దశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్‌ వర్గాల సమాచారం. వేదాళం చిత్ర సమయంలో విపత్తు కారణంగా కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న అజిత్‌ చిన్న విరామం అనంతరం నటిస్తున్న చిత్రం ఇది.

ఇక పోతే సహజంగానే డూప్‌లతో చిత్రీకరించడానికి అంగీకరించని అజిత్‌ ఈ చిత్రంలోని రిస్కీఫైట్‌ సన్నివేశాల్లో కూడా డూప్‌ లేకుండా తానే నటిస్తున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్‌ తదుపరి చిత్రం ఏమిటని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు, సినీ వర్గాలకు తాజా సమాచారం అజిత్‌ దర్శకుడు ఎస్‌పీ.జననాథన్ తో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నారన్నదే. ఇంతకు ముందు ఇయర్కై, పేరాన్మై, పొరంబోకు వంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌పీ.జననాథన్ తాజాగా అజిత్‌ కోసం మంచి కథను తయారు చేశారని, ఆ కథ అజిత్‌కు వినిపించి ఓకే చేయించుకున్నారని సమాచారం. ఇది కూడా సోషల్‌ మెసేజ్‌తో కూడిన భారీ యాక్షన్  కథా చిత్రంగా ఉంటుందని టాక్‌. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికపూర్వక ప్రకటన వెలువడాల్సిఉందన్నది గమనార్హం.

Advertisement
Advertisement