దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆ సినిమా పాటలు లీకై ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఓవైపు బాహుబలి యూనిట్ ఈనెల 13న తిరుపతిలో ఆడియో విడుదలకు సన్నాహులు చేస్తుంటే మరోవైపు ఆ సినిమా పాటలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ అవుతున్నాయి. బాహుబలి సినిమాలో మొత్తం 8 పాటలు ఉండగా, వాటిలో ఆరు పాటలు లీక్ అయినట్లు సమాచారం.
కాగా పాటలు లీక్ అయినట్లు వాస్తవమేనని చిత్ర యూనిట్ అంగీకరిస్తోంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ముందుకు రావటం లేదు. అయితే ఈ పాటలను ఎవరూ అప్ లోడ్ చేశారనే దానిపై సమాచారం లేదు. కాగా పాటల లీక్ నేపథ్యంలో లహరి సంస్థ ....ఆడియో విడుదల కాకుండానే ఓ పాటను యూట్యూబ్లో పెట్టడం విశేషం.
కాగా లీక్ అయిన పాటలు క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. ఇక ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసిన బాహుబలి పాటల లింక్స్ను తొలగించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక గతంలోనూ13 నిమిషాల నిడివిగల బాహుబలి సినిమా లీకైన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్కా మీడియా పతాకంపై కె. రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని...బాహుబలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రభాష్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి బాణీలు సమకూర్చారు. కాగా జూలై 10న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.