మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ | Sakshi
Sakshi News home page

మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ

Published Sat, Nov 29 2014 11:31 PM

మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ

 ‘‘మా సంస్థలో నిర్మించిన ఐదో చిత్రం ఇది. ఇందులో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ‘అమ్మ’ పాట చాలా హృద్యంగా ఉంటుంది. మా అబ్బాయి ఆ పాట మాకు వదిలి తను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’ అని బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. కమలాకర్ హీరోగా చింతలపూడి వెంకట్ దర్శకత్వంలో బూచేపల్లి వెంకాయమ్మ సమర్పణలో బి. నాగలక్ష్మి నిర్మించిన ‘బ్యాండు బాలు’ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమలాకర్ తల్లి వెంకాయమ్మ తన కొడుకుని గుర్తు చేసుకున్నారు.
 
 ఈ చిత్రంలో ‘అమ్మ...’ మీద ఉన్న పాటను తన గుర్తుగా మాకు వదిలేసి, తను వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. కమలాకర్ పిల్లల కోసం తాము బతుకుతున్నామనీ, లేకపోతే తను వెళ్లిపోయినప్పుడే మేమూ... అంటూ దుఃఖంతో మాట్లాడలేకపోయారు. కమలాకర్ తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ -‘‘2012లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి, పది నెలల్లో పూర్తి చేశాం. విడుదలకు సిద్ధం చేస్తున్న సమయంలో కమలాకర్ మరణం మమ్మల్ని కలిచివేసింది. ఆ మానసిక క్షోభ కారణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కొంచెం తేరుకున్నాం. సెంటిమెంట్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
 
 సినిమా మీద మమకారంతో లాభాలను బేరీజు వేసుకోకుండా కమలాకర్ సినిమాలు తీసి, పది మందికి ఉపాధి కల్పించాడని నటుడు చలపతిరావు చెప్పారు. దర్శకుడు చింతలపూడి వెంకట్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ మీద ఒక పాట ఉంది. ఈ పాట చిత్రీకరిస్తున్న సమయంలో వెంకాయమ్మగారు షూటింగ్‌కి వస్తే, ఆవిడ కూడా ఉంటే బాగుంటుందన్నాను. కానీ, కమలాకర్ వద్దన్నాడు. చివరికి ఆయన భార్య, ‘అమ్మ పాటే కదా.. ఉంటే బాగుంటుంది’ అనడంతో కమలాకర్ అంగీకరించాడు. ఈ విధంగా ఈ పాటలో ఆమె ఉన్నారు. ‘ప్రతి తల్లికీ ఈ పాట మంచి బహుమతి’ అని కమలాకర్ అనేవారు. అంత గొప్పగా ఉంటుంది’’ అన్నారు. కమలాకర్ సోదరుడు శివప్రసాద్‌రెడ్డి, నటులు బెనర్జీ, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement