హీరోయిన్ నన్ను పెళ్లాడి మోసగించింది | Sakshi
Sakshi News home page

హీరోయిన్ నన్ను పెళ్లాడి మోసగించింది

Published Fri, Feb 26 2016 3:31 AM

హీరోయిన్ నన్ను పెళ్లాడి మోసగించింది

నటి మేఘనారాజ్‌పై తమిళనాడు వ్యాపారవేత్త జనార్దన్ ఫిర్యాదు
  సాక్షి, బెంగళూరు: తెలుగు, కన్నడతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించిందంటూ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త జనార్దన్ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఆయన కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.  అయితే.. ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో కేసును మూసేసినట్లు బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ లోకేష్ కుమార్  వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సినీనటి మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా దొంగలించారంటూ జనార్దన్ కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.  జేపీనగర పోలీసులు  ఈ కేసు దర్యాప్తును చేపట్టారు.  
 
 జనార్దన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలను సేకరించారు. నటి మేఘనారాజ్‌తో వివాహమైనట్లుగా ఆయన ఎలాంటి సాక్ష్యాలనూ చూపలేకపోయారు. నగరంలో మేఘనారాజ్ నివాసం ఎక్కడున్నదీ కూడా  చెప్పలేకపోయారు. దీంతో  ఫిర్యాదు దశలోనే ఈ కేసును మూసేశారు. ఈ విషయంపై మేఘనా రాజ్ తల్లి ప్రమీలా జోషాయ్ మాట్లాడుతూ....‘అసలు జనార్దన్ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలీదు. సినీ రంగంలో నా కూతురు ఎదుగుదలను చూసి సహించలేని కొందరు ఈ విధంగా దుష్ర్పచారానికి దిగుతున్నారు. జనార్దన్‌పై చట్టపరమైన చర్యలకు  సిద్ధమవుతున్నామ’ని చెప్పారు.  
 

Advertisement
Advertisement