ఇండియన్‌కు సీక్వెల్ తెరకెక్కనుందా? | Sakshi
Sakshi News home page

ఇండియన్‌కు సీక్వెల్ తెరకెక్కనుందా?

Published Mon, May 16 2016 4:01 AM

ఇండియన్‌కు సీక్వెల్ తెరకెక్కనుందా? - Sakshi

అవినీతికి అంకుశం లాంటి చిత్రం ఇండియన్. ముఖ్యంగా లంచంపై అవిశ్రాంతి పోరాటం చేసి గెలిచిన ఒక స్వాతంత్య్ర యోధుడి వీరగాథే ఇండియన్.తెలుగు భారతీయుడుగా విడుదలై సంచలన విజయానికి కారుకుల్లో ముగ్గురు పేర్లను ముఖ్యంగా ప్రస్తావించాలి. ఒకరు విశ్వనటుడు కమలహాసన్. ఇందులో ఆయన ద్విపాత్రాభియనం అద్భుతం అనే చెప్పాలి. ఇండియన్‌గా ఆయన గెటప్ నుంచి ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా వర్ణించాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రానికి సృష్టికర్త స్టార్ డెరైక్టర్ శంకర్. ఆయన దర్శక ప్రతిభకు ఇండియన్ చిత్రం ఇక తార్కాణం.

లంచగొండితనం ఆయన సంధించిన పాశుపతాస్త్రం ఇండియన్ . కమలహాసన్, శంకర్‌ల కాంబినేషన్‌లో బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించిన ఘనత ఎస్ నిర్మాత ఏఎం.రత్నానికే దక్కుతుంది. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం పక్కబలంగా నిలిచిందని చెప్పక తప్పదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కాలాన్ని గెలిచిన ఈ చిత్రం తెరపై కొచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న ట్రెండ్ ఇది.

అయితే ఘన విజయాలను సాధించిన కమలహాసన్ ఇండియన్,రజనీకాంత్ బాషా చిత్రాలకు కొనసాగింపు చిత్రాలు రూపొందితే బాగుండని ఆశించే అభిమానుల శాతం ఎక్కువగానే ఉంటుంది. భాషా-2 తెరకెక్కనుందనే ప్రచారం కొంత కాలం క్రితం మీడియాలో హల్ చల్ చేసింది.అయితే బాషా చిత్రానికి సీక్వెల్ సాధ్యం కాదని ఆ చిత్ర కథానాయకుడు సూపర్‌స్టార్ తేల్చి చెప్పారు. ఆయన అభిమానులు కూడా బాషా ఒకే ఒక్కడు అని స్పష్టం చేశారు. కమలహాసన్ కెరీర్‌లో మైలురాయిగా పేర్కొనే చిత్రాల్లో ఒకటైన ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తాజాగా కోలీవుడ్ వర్గాలలో వినిపిస్తుండడం విశేషం.

దర్శకుడు శంకర్ తాజాగా రజనీకాంత్‌తో 2.ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక కమలహాసన్ రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దర్నీ కలిపి ఇండియన్-2 చేయడానికి ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ప్రయత్నిస్తున్నట్లు ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే మరో మంచి చిత్రాన్ని సినీ ప్రియులు చూసే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement