ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాక హంగ్ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీ మనిషంటూ బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా బీజేపీ, ఆరెస్సెస్ మనిషి కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారో అందరికీ తెలిసిన విషయమేనంటూ ట్వీటర్ వేదికగా ఆయన చేసిన కామెంట్ వైరల్ అయింది. దీనిపై బీజేపీ అభిమానులు సీరియస్ అయిన విషయం తెలిసిందే.
ఉదయ్ని ‘బాలీవుడ్ రాహుల్ వచ్చేశాడు’ అంటూ కొందరు కామెంట్ చేయగా, ‘నువ్వూ రాజకీయాల్లోకి రాకపోయావా’ అంటూ మరికొందరు నెటిజన్లు ఆయనపై కామెంట్ల వర్షం కురిపించారు. అయితే వీటిపై స్పందించిన ఉదయ్... ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేసే కనీస హక్కు అందరికీ ఉందని వారందరికీ సమాధానం ఇచ్చాడు.
తనకు కలిగిన అభిప్రాయం తప్పని అనుకోవడం లేదని తెలిపారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా తన గోడు వెల్లబోసుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉందని ఉదయ్ తెలిపారు. కాగా, లాంగెర్ మీనాక్షి అనే నెటిజన్.. ‘ఓడిపోయిన వారికి అభిప్రాయాలు చెప్పుకొనే స్వేచ్ఛ ఉందనీ.. అయితే బావిలో కప్పలా ఆలోచించే వారు, లోకజ్ఞానం లేకుండా మాట్లాడేవారు.. నోరు మూసుకుని ఉంటే మంచిది’ అని చేసిన ట్వీట్పై ఉదయ్ స్పందించారు.
‘మనది ప్రజాస్వామ్య దేశం. ఓడిపోయినంత మాత్రాన నోరు నొక్కేస్తారా..! ఎవరి అభిప్రాయాలు వారివి’ అంటూ రీట్వీట్ చేశారు. కాగా వజుభాయ్ వాలాను బీజేపీ, ఆరెస్సెస్ మనిషంటూ ఉదయ్ చేసిన ట్వీట్పై మరో నెటిజన్.. భారత రాష్ట్రపతి కాక పూర్వం ప్రణబ్ ముఖర్జీ కూడా కాంగ్రెస్ మనిషే కదా..! అంటూ ట్రోల్ చేశారు.
Not really. In a democracy a loser is allowed to have opinions too