తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చకండి | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చకండి

Published Sat, May 28 2016 3:56 AM

don't Admits Orphanages in Parents

తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చకండి అని సీనియర్ నటుడు రాధారవి హితవు పలికారు. గురువారం సాయంత్రం చెన్నైలోని గ్రీన్‌పార్క్ హోటల్‌లో జరిగిన ఇరైవి చిత్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాధారవి పై విధంగా పేర్కొన్నారు. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇరైవి. విజయ్‌సేతుపతి, ఎస్‌జే.సూర్య, బాబీసింహా, అంజలి, కమలిని ముఖర్జి, కరుణాకరన్, రాధారవి  నటించిన ఈ చిత్రాన్ని తిరుకుమరన్ ఎంటర్‌టెయిన్‌మెంట్, అభి అండ్ అభి, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

పచ్చైక్కారన్ చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టి మంచి లాభాలను ఆర్జించిన ఆర్‌కే.ఫిలింస్ సంస్థ ఏరియా 78 ప్రొడక్షన్ హౌస్ సంస్థతో కలిసి ఇరైవి చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏరియా 78 ప్రొడక్షన్ హౌస్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. రాధారవి మాట్లాడుతూ కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కారణం తాను 45 ఏళ్లుగా 300 చిత్రాలకు పైగా నటించానన్నారు. అందులో అధిక భాగం చెడ్డవాడిగానే నటించానని కొన్ని చిత్రాల్లో మంచి వాడిగా నటించినా, ఇరైవి చిత్రంలో కార్తీక్‌సుబ్బరాజ్ మరింత మంచి వాడిగా చూపించారన్నారు.

కార్తీక్‌సుబ్బరాజ్ చాలా తెలివైన దర్శకుడని ప్రశంసించారు. ఇరైవి చిత్రం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని విడుదలైన తరువాత ప్రజలే చెబుతారని అన్నారు. అయితే చిత్రంలో నటించిన వారందరూ అంకిత భావంతో నటించారని అభినందించారు. ఈ సందర్భంగా తను ఇచ్చే సందేశం ఏమిటంటే తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపకండి అన్నారు. అనాథాశ్రమాలు లేని దేశమే మానవత్వం ఉన్న ప్రజా దేశమని రాధారవి పేర్కొన్నారు. ఇరైవి చిత్రం జూన్ 3న విడుదల కానుంది.

Advertisement
Advertisement