రేసుగుర్రం వంశీతో..! | Sakshi
Sakshi News home page

రేసుగుర్రం వంశీతో..!

Published Tue, Sep 27 2016 11:50 PM

రేసుగుర్రం వంశీతో..!

వరుస విజయాలతో ‘సరైన’ దారిలో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఒకవైపు ఈ సినిమా చేస్తూనే మరోవైపు తన తదుపరి తెలుగు చిత్రానికి జెండా ఊపారట. వరుస విజయాలతో రేసు గుర్రంలా దూసుకెళుతు న్నారు బన్నీ. ఈ స్టైలిష్ స్టార్ కెరీర్‌లో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రాల్లో ‘రేసుగుర్రం’ ఒకటి. 
 
 ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ. అప్పటి పరిచయంతో వంశీ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే ఆయన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశారట. పలు హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. బన్నీ 14 ఏళ్ల  కెరీర్‌ని విశ్లేషిస్తే ఒక్క ‘ఆర్య’ చిత్రానికే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చారు. మళ్లీ ఇన్నాళ్ళకు ఒక నూతన దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. 
 
 జనవరిలో ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తమిళ చిత్రం చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించారు. లింగుస్వామి, వక్కంతం వంశీ.. ఈ ఇద్దరి సినిమాల షూటింగ్‌లూ ఇంచుమించు ఒకేసారి మొదలవుతాయట!
 

Advertisement
Advertisement