భేల్‌పురి మా వాడికి తెగ నచ్చేసింది... | Sakshi
Sakshi News home page

భేల్‌పురి మా వాడికి తెగ నచ్చేసింది...

Published Tue, Sep 2 2014 11:01 PM

భేల్‌పురి మా వాడికి తెగ నచ్చేసింది... - Sakshi

మహేశ్‌బాబు ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వినాయక చవితి మరునాడు విడుదలైన ‘ఆగడు’ చిత్ర గీతాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడం ఒక కారణమైతే, ఇటీవలే పుట్టిన రోజు జరుపుకొన్న కుమారుడు గౌతమ్ పదే పదే ఆ పాటలు వింటూ, డ్యాన్సులు చేస్తుండడం మరో కారణం.గౌతమ్ కు 8 ఏళ్ళు వచ్చిన సందర్భంగా మహేశ్ ట్విట్టర్‌లో ఈ సంగతులు పంచుకుంటూ, ‘‘ఆగడు పాటలు మా అబ్బాయికి భలే పట్టేశాయి. ముఖ్యంగా ‘భేల్‌పురి’ పాట వాడికి తెగ నచ్చింది. అందుకే, పదే పదే ఆ పాట వింటున్నాడు’’ అని పేర్కొన్నారు.
 
  గమ్మత్తు ఏమిటంటే, ఈ పాట హీరోయిన్ తమన్నాకు కూడా విపరీతంగా నచ్చిందట. ఈ మిల్కీ బ్యూటీ ‘ఆగడు’ పాటలను తెగ మెచ్చుకుంటూ, ‘‘ఆడియోకు లభిస్తున్న స్పందనతో ఆనందంలో తేలిపోతున్నా. ‘భేల్‌పురి’ పాట అయితే మరీనూ’’ అని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వ్యాఖ్యానించారు. దసరా పండుగను రెండు వారాల ముందే జరుపుకొందామంటూ ఆడియో రిలీజ్‌లో మహేశ్ చేసిన వ్యాఖ్యలతో ఈ నెల 19న రానున్న ‘ఆగడు’ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడీ తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నాయి. గతంలో అపూర్వ వాణిజ్య విజయమైన ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లోనే మళ్ళీ వస్తున్న ‘ఆగడు’ కోసం మరి రెండు వారాలు ఆగాల్సిందే.
 

Advertisement
Advertisement