మరోసారి హారర్‌తో జీవీ | Sakshi
Sakshi News home page

మరోసారి హారర్‌తో జీవీ

Published Tue, Aug 16 2016 1:59 AM

మరోసారి హారర్‌తో జీవీ

హారర్ చిత్రాల ట్రెండ్ కోలీవుడ్‌లో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ తరహా చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టుకోవడమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. జయం రవి మిరుదన్ చిత్రంతో తాజాగా హిట్ కొట్టారు. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా జంటగా హారర్ చిత్రంలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఇక నటుడు కార్తీ నయనతారతో కలిసి కాష్మోరా అంటూ భయపెట్టడానికి రానున్నారు. అదే విధంగా యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ తొలి సారిగా డార్లింగ్ అంటూ హారర్ చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
 
 ఆ తరువాత పెన్సిల్, త్రిషా ఇల్లన్నా నయనతార, ఎనక్కు ఇన్నోర్ పేరు ఇరుక్కు చిత్రాలు విడుదలై సక్సెస్ అయినా, డార్లింగ్ చిత్రానిదే పెద్ద విజయం అని చెప్పక తప్పదు. తాజాగా మరోసారి జీవీ.ప్రకాశ్‌కుమార్ హారర్‌ను నమ్ముకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కడవుల్ ఇరుక్కాన్ కమారు చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇంతకు ముందు శివ మనసుల శక్తి, భాస్ ఎందిర భాస్కరన్ తదితర విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రాజేశ్.ఎం దర్శకత్వం వహిస్తున్నారు.
 
 ఇందులో జీవీకి జంటగా డార్లింగ్‌లో జత కట్టిన నిక్కీగల్రాణియే నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముగప్పేర్‌లో జరుపుకుంటుంటోంది. ఇప్పటికి 95 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డార్లింగ్ విజయాన్ని రిపీట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాయట యూనిట్ వర్గాలు. వినోదాన్ని పండించడంలో అందె వేసిన దర్శకుడు రాజేశ్ ఈ చిత్రాన్ని హారర్‌తో కూడిన కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement