సినీ రంగంలో హీరోలుగా కొనసాగుతున్న తారలు, ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా నిర్మాతలు గా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను నిర్మించేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తప్పని సరి పరిస్థితుల్లో కూడా హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. తాజాగా యంగ్ హీరో సుధీర్ బాబు అలాంటి పరిస్థితే ఎదురైందన్న ప్రచారం జరుగుతోంది.
సుధీర్ బాబు హీరోగా రాజశేఖర్ నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను ప్రారంభించారు. అయితే ఈ చిత్ర నిర్మాతలు నిర్మాణం నుంచి తప్పుకోవటంతో ఆ బాధ్యతను కూడా సుధీర్ బాబు తీసుకున్నాడు. కథతో పాటు దర్శకుడి మీద నమ్మకం ఉండటంతో సుధీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో కన్నడ నటి నబా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతానికి సుధీర్ నిర్మాతగా మారటంపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.