అయ్యో పాపం..! | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం..!

Published Tue, Jan 19 2016 12:22 AM

అయ్యో పాపం..!

హీరోలు యాక్షన్ సన్నివేశాల కారణంగా గాయాలపాలు కావడం సర్వసాధారణం. అలా బాలీవుడ్‌లో ఇటీవల ఒకేసారి ఇద్దరు హీరోలు గాయాలపాలయ్యారు. ఒకరు హృతిక్ రోషన్, మరొకరు షాహిద్ కపూర్. గాయాల పాలైన ఆ సంఘటనల వివరాలేమిటంటే...
  హృతిక్ రోషన్, పూజా హెగ్డే జంటగా అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో స్వీయదర్శకత్వంలో ఆశుతోష్ గోవారీకర్ రూపొందిస్తున్న చారిత్రక కథా చిత్రం ‘మొహెంజొదారో’. ఈ చిత్రం ప్రారంభమై, ఏడాది పైనే అయ్యింది. ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కోసం హృతిక్ చాలా రిస్కులు తీసుకుంటున్నారు. వీరోచితమైన పోరాట దృశ్యాలకు కొదవే లేదట. ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు హృతిక్ పట్టు తప్పి పడిపోయారు. దాంతో ఎడమ కాలికి బలమైన గాయం తగిలింది. దీనివల్ల కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.

  విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక కథా చిత్రం ‘రంగూన్’. ఈ చిత్రం కోసం షాహిద్ కపూర్, ఓ జపనీస్ నటుడు పాల్గొనగా ఓ ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో జపనీస్ నటుడి గుండెకు బలంగా దెబ్బ తగలడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. షాహిద్ కపూర్ వేలికి కూడా బలమైన గాయమే తగిలింది. దాంతోపాటు విరామం లేకుండా ఆరు గంటల పాటు వర్షం సీక్వెన్స్‌లో నటించడంతో షాహిద్ జ్వరాన బారిన పడ్డారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్నారు.
 

Advertisement
Advertisement