నేను బాగున్నాను | Sakshi
Sakshi News home page

నేను బాగున్నాను

Published Fri, Sep 8 2017 1:18 AM

నేను బాగున్నాను - Sakshi

సెలబ్రిటీలు దగ్గినా, తుమ్మినా టాపిక్కే. జులుబు తగ్గడానికి మందులు ఇవ్వమని డాక్టర్‌ని సంప్రదించినా అది టాపిక్కే. ‘ఏదో అనారోగ్యం అట’ అని ఈజీగా అనేస్తారు. ప్రముఖ గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గురించి ఇలాంటి వార్తే ప్రచారంలోకి వచ్చింది. సోషల్‌ మీడియా సాక్షిగా ఈ వార్త జోరుగా షికారు చేయడం మొదలుపెట్టింది. దాంతో ఎస్పీబీ ‘ఫేస్‌బుక్‌’ ద్వారా ‘నేను బాగున్నాను’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. ‘‘నా ఆరోగ్యం గురించి ప్రపంచ నలుమూలల నుంచి ఎంక్వైరీలు వచ్చాయి. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందన్న కారణం చేత షెడ్యూల్స్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నానన్న వార్తలు వస్తున్నాయని కొందరు నా దృష్టికి తెచ్చారు.

జలుబు వల్లో లేక దగ్గు వల్లో హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు కొందరు చూసి, నా ఆరోగ్యం బాగాలేదని ఊహించుకోవడం ఫూలిష్‌నెస్‌. నేను డాక్టర్‌ను కలిసినంత మాత్రాన నా ఆరోగ్యం క్షీణించినట్లు కాదు. నా యంగర్‌ సిస్టర్‌ మిసెస్‌ గిరిజ గత నెల 23న చనిపోయారు. అప్పుడు షెడ్యూల్స్‌ క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత నేను సెప్టెంబర్‌ 2న బెంగళూరులో సంగీత కచేరీ ఇచ్చిన సంగతి మర్చిపోవద్దు. అనవసరంగా ఇలాంటి పుకార్లను స్ప్రెడ్‌ చేసి, చాలామంది ఫీలింగ్స్‌ను హర్ట్‌ చేయడంలో వారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఇలాంటివి చేయకండి. అందుకే నాకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనిపించదు. ఇలాంటి రూమర్స్‌ను స్ప్రెడ్‌ చేసి ఎవరైతే ఆనందం పొందుతున్నారో వారికి గాడ్‌ బ్లెసెస్‌’’ అని ఎస్పీబీ వీడియో ద్వారా తెలిపారు.

Advertisement
Advertisement