హాలీవుడ్‌కెళ్లేది ఎవరు? | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కెళ్లేది ఎవరు?

Published Mon, Aug 11 2014 12:52 AM

హాలీవుడ్‌కెళ్లేది ఎవరు?

కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమయిన అంశం గురించి చర్చ జోరుగా సాగుతోంది. అదే హాలీవుడ్‌కెళ్లే దక్షిణాది హీరోయిన్ ఎవరన్నది. ఈ విషయంలో అందాల తార అనుష్క,నయనతారల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే హాలీవుడ్‌లో రూపొందుతున్న బ్రహ్మాండ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం ఎక్స్‌పాండబుల్‌లో ఏడుగురు హీరోయిన్లు ముఖ్య పాత్రలు ధరించనున్నారట. ఈ ఏడుగురు హీరోయిన్ల పాత్రలకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నటీమణులను ఎంపిక చేసి నటింప చేయాలన్నది యూనిట్ వర్గాల నిర్ణయం.
 
 ఆ ఏడుగురు హీరోయిన్లలో దక్షిణాదికి చెందిన ఒక నటిని నటింప జేయాలని నిర్ణయించారట. వచ్చే ఏడాది ఎక్స్‌పాండబుల్ చిత్ర దర్శక, నిర్మాతల బృందం ముంబాయి చెన్నైలో మకాం పెట్టి హీరోయిన్ల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు సిల్వర్‌స్టార్ స్టాలిన్, మెల్‌గిప్సన్‌లు గౌరవ పాత్రల్లో మెరవనున్నారట. చిత్రంలో ఏడుగురు హీరోయిన్లు గ్లామర్‌ను గుప్పించడంతో పాటు సాహసోపేత పోరాటాలు చేయూల్సి ఉంటుందట. దీంతో తమిళంలో నయనతార, అనుష్క, రాయ్ లక్ష్మీ, నీతు చంద్రలలో ఒకరు ఎంపికయ్యే వకాశం ఉందని సమాచారం.
 
 అనుష్క అరుంధతి చిత్రంలో కత్తి చేత పట్టి రౌద్రపూరిత నటనను ప్రదర్శించారు. తాజాగా రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో వీరోచిత పాత్రల్ని పోషిస్తున్నారు. నయనతార తమిళ బిల్లా చిత్రంలో ఈత దుస్తుల్లో అందాల మోత మోగించడంతోపాటు పిస్టల్ చేత పట్టి హీరోయిజాన్ని ప్రదర్శించారు. ఇక నీతు చంద్ర ఆదిభగవాన్ చిత్రంలో, రాయ్‌లక్ష్మీ కూడా కొన్ని చిత్రాల్లో యాక్షన్ హీరోయిన్‌గా నటించారు. అయితే నయనతార, అనుష్కల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని కోలీవుడ్ టాక్.  మరి హాలీవుడ్‌కు వెళ్లేదెవరో..?
 

Advertisement
Advertisement